2018 నాటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని.. తాము చాలా త్యాగం చేశాం అని భావిస్తున్న మన తెలంగాణ పార్టీ సారథి కోదండరాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి సభలో అడుగు పెట్టాలని పెట్టుకుంటున్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఆశలకు కాంగ్రెస్ సీనియర్లు చెక్ పెడుతున్నారు. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించడానికి వీల్లేదని సీనియర్లు అడ్డుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా బలం ఉన్నదని, తామే బరిలో నిలబడాలని వారు అంటున్నారు.
ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ పోరాటం సమయంలో జేఏసీకి సారథ్యం వహించడం ద్వారా అన్ని పార్టీలను కలుపుకుపోతూ.. రాష్ట్ర సాధనలో ఒక కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. అయితే రాష్ట్రం ఏర్పాడ్డ తర్వాత బండ్లు ఓడలయ్యాయి. ఓడలు బండ్లయ్యాయి. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత.. కోదండరాంను కేసీఆర్ పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. దాంతో ఆయన అప్పటికి తిరిగి తన ప్రొఫెసర్ ఉద్యోగంలోకి వెళ్లిపోయినా రాజకీయ ఆశ చావలేదు.
రిటైరైన తర్వాత.. తెలంగాణ జనసమితి పార్టీని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకోసం పోరాడుతున్నట్లుగా కొంత హడావుడి చేశారు. రాజకీయంగా బలాబలాలు ఎలా ఉన్నప్పటికీ.. కోదండరాం చిత్తశుద్ధి మీద ఎవరికీ అనుమానం లేదు గనుక.. పార్టీకి అంతో ఇంతో ప్రాభవం ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే 2018 ఎన్నికల సమయానికి సొంతంగా పోటీచేసేంత బలం రాలేదు. కాంగ్రెస్ తెలుగుదేశాలతో కలిసి బరిలోకి దిగారు. దారుణంగా దెబ్బతిన్నారు.
అయతే చట్టసభల్లో ప్రవేశించాలన్న కోదండరాం కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. నల్గొండ కేంద్రంగా జరగబోయే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగుతున్నారు. అయితే అధికార తెరాస మీద విజయం సాధించడానికి అన్ని విపక్షాల మద్దతును కూడా ఆయన ఆశిస్తున్నారు. అందులో భాగంగానే.. కాంగ్రెస్, తెలుగుదేశం ఇతర పార్టీల మద్దతు కూడా కోరుతున్నారు.
తాజా డెవలప్మెంట్ ఏంటంటే.. కాంగ్రెస్ సీనియర్లు మాత్రం కోదండరాంకు మద్దతు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు.
ఇతర పార్టీల అవసరం లేదు : వీహెచ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ పార్టీ లోనే బోలెడు మంది బలమైన అభ్యర్థులు ఉన్నారని, ఇతర పార్టీల వారి అవసరం ఇప్పుడు లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు అంటున్నారు. గతం లో పొత్తు పెట్టుకొని నష్టపోయామని, అన్ని కులాల నుండి చదుకున్న వారు మా పార్టీ లో ఉన్నారని, మా పార్టీ లో ఉన్నవారే పోటీ చేస్తే కింది స్థాయి నుండి పార్టీ బలోపేతం ఔతుందని వీహెచ్ అంటుండడం విశేషం.
తమ పార్టీ నుంచి మాత్రమే అభ్యర్థి బరిలోకి దిగాలని, కోదండరాంకు మద్దతు ఇవ్వకూడదని ఆయన కోరిక బాగానే ఉంది. అయితే తమ పార్టీ బరిలో ఉంటే గెలుస్తుందని మాత్రం ఆయన మాటమాత్రంగా కూడా చెప్పడం లేదు. పార్టీ బలోపేతం అవుతుందని మాత్రమే లౌక్యంగా అంటున్నారు.
అదే సమయంలో పొన్నా లక్ష్మయ్య అభ్యంతరాలు మరో రకంగా ఉన్నాయి.
నా సీటు అడిగినప్పుడు ఇదో లెక్కా.. : పొన్నాల
గతంలో నా సీట్ నే అడిగిన కోదండరాం ఇప్పుడు ఎంఎల్సీ అడగటం లో ఆశ్చర్యం ఏముందని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అంటున్నారు. 0.6 శాతం ఓట్లు ఉన్న ఆ పార్టీ గురించి మా అధిష్టానం నిర్ణయం తీస్కుంటుందని ఆయన చెబుతున్నారు. పొత్తులు అనివార్యం గా ఉంటాయి కానీ దాంట్లో గెలుపు ఓటములు బేరీజు వేసుకొని నిర్ణయాలు ఉంటాయని పొన్నాల చెబుతున్నారు. గెలిచే అవకాశం కాంగ్రెస్ కి ఎక్కువ ఉంది కాబట్టి పోటీ ఎక్కువ ఉందని, అధిష్టానందే తుది నిర్ణయం అని అంటున్న పొన్నాల మాటలు గమనిస్తే.. అభ్యర్థి తమ పార్టీ నుంచి ఉంటే.. కోదండరాం కూడా అందుకు సహకరించాలని కోరుతున్నట్లుగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు.. టీపీసీసీ సారథి నియామకాన్నే వాయిదా వేయించగలిగారు. అలాంటిది.. సొంత బలం ఇప్పటిదాకా నిరూపించుకోలేని కోదండరాం కోసం అనుకూల నిర్ణయాలు తీసుకునేందుకు తలొగ్గుతారా? అనేది ప్రశ్న. ఇలాంటి వారు ఇంతగా వ్యతిరేకిస్తుండగా.. తన చట్టసభ కల నెరవేర్చుకోవడానికి కోదండరాంకు కాంగ్రెస్ సహకారం అనుమానమే అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.











