(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో జరిగిన ఘటనను రాజకీయం చేయొద్దని, దర్యాప్తునకు సహకరించాలని విజయనగరం ఎస్పీ బి. రాజకుమారి స్పష్టం చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రామతీర్ధం కేసులో ఇప్పటికే 20 మంది అనుమానితులను ప్రశ్నించామని, శనివారం మరో 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. రామతీర్ధం ఘటనలో నాయకులు పోలీసులకు సహకరించాలని, రెచ్చెగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే సహించబోమని అన్నారు.
ఘటనను రాజకీయంగా వాడుకోవడం సరికాదని ఆమె పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలోని రామతీర్ధం పుణ్యక్షేత్రంలో కోదండరాముని విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు, ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం రామతీర్థం వస్తున్న నేపథ్యంలో ఆమె ముందస్తు హెచ్చరిక చేశారు. సమావేశంలో విజయనగరం డీఎస్పీ అనిల్ పాల్గొన్నారు.