కడప జిల్లాకు నీరుఇచ్చే ప్రధాన జలాశయం గండికోటలో నీరు నిల్వ చేయడం వలన 22 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ముంపునకు గురైన 22 గ్రామాలలో మొదటి విడతలో 14 గ్రామాలు, రెండో విడతలో 8 గ్రామాలకు పునరావాసం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. మొదటి విడత పునరావాసంలో ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. కానీ రెండవ విడతలో తాళ్ల ప్రొద్దటూరు, చామలూరు, ఎర్రగుడి గ్రామాల వాసుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. గ్రామాలలో ప్రజలు ఉండగానే నీరును వదలడమే వివాదానికి కారణంగా నిలిచింది. 26.85 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న గండికోట జలాశయంలో అధికారులు ప్రస్తుతం 12.5 టీఎంసీల నీరును ఉంచారు.
కానీ బ్యాక్ వాటర్ తో తాళ్ల ప్రొద్దటూరు, చామలూరు, ఎర్రగుడి గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ గ్రామాలలో 3000లకు పైగా ప్రాజెక్ట్ డీప్లేసెమెంట్ కుటుంబాలుగా గుర్తించిన అధికారులు వారికి పునరావాసం కల్పించవలసి ఉంది. పునరావాస సాయం కింద 10 లక్షలు, రీ సెటిల్మెంట్ కింద నివాస స్థలంతో బాటు 7 లక్షలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 23 నుంచి మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 1000 మందికి మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. ఇంకా అందరికీ పునరావాసం చెల్లించకముందే తాళ్ల పొద్దుటూరులో ఓ ఇంటిని అధికారులు పడగొట్టారు. ఒక వైపు బ్యాక్ వాటర్, మరో వైపు అధికారులు ఖాళీ చేయిస్తుండటంతో గ్రామ ప్రజలు ఆందోళనకు గురై రోడ్లెక్కారు. దీంతో ఆయా గ్రామాలలో పోలీసులు భారీగా మోహరించారు.
ముఖ్యమంత్రికి మాజీ ఐఎఎస్ లేఖ
ఈ నేపథ్యంలో మాజీ ఐఎఎస్, ఈఏఎస్ శర్మ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఓ లేఖ వ్రాశారు. గండికోట జలాశయంలో నీరు నిల్వ చేయడం వలన కడప జిల్లాలో తాళ్ల ప్రొద్దటూరు, చామలూరు, ఎర్రగుడి గ్రామాలు ముంపుకు గురి అయ్యాయని ఆ లేఖలో తెలిపారు. గండికోట జలాశయం రెండవ విడతలో పేరులో అక్కడి గ్రామ ప్రజలను వారివారి ఇళ్లను, ఇంటి సామానులను వదులుకుని వెళ్లాలని అధికారులు బలవంతం చేస్తున్నారని వెల్లడించారు. వారిలో చాలా మందికి 2013 భూసేకరణ చట్టం క్రింద రావలలిసిన నష్టపరిహారం రాలేదని గుర్తు చేశారు. 2013 భూసేకరణ చట్టం క్రింద, నిర్వాసితులు అయ్యే ప్రజలతో అధికారులు ముందస్తుగా సంప్రదించి, వారికి కలిగే నష్టాలను గుర్తించి, వారు అంగీకరించిన తరువాతనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని గుర్తు చేశారు.
కానీ గండికోట జలాశయం అంశంలో అటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరుగలేదని పేర్కొన్నారు. ఆ చట్టం క్రింద పునరావాస చర్యలు తీసుకోకుండా భూసేకరణ చేయకూడదని ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటి వరకు పునరావాస ప్రణాళిక ఇంతవరకు సరిగ్గా అమలు జరగలేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలను బలవంతంగా నిర్వాసితులను చేయడం, వారి మానవహక్కులు ఉల్లంఘించినట్లు అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలకు కట్టుబడి ప్రజలకు జవ్వాబు దారీగా ఉండాలని అన్నారు . పౌరుల ప్రాధమిక హక్కులకు, మానవహక్కులకు మన రాజ్యాంగంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఇవ్వబడిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. 2013 భూసేకరణ చట్టంలో ప్రతిపాదించిన ప్రజాస్వామ్య విధానాలను ప్రభుత్వం గౌరవిస్తుందని ప్రజలు ఆశలు పెట్టుకున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
గండికోట ముంపు గ్రామాల ప్రజల విషయంలో సీఎం జగన్ జోక్యం చేసుకుంటారని, ప్రజల మనోభావాలను గౌరవిస్తారని తనకు నమ్మకం ఉందని లేఖలో తెలిపారు.అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచిన మానవహక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశ్రీని గృహనిర్బంధం చేయడం తప్పని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య విధానాలను వ్యతిరేకించినట్లు అవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణం ఆమెమీద ఉన్న ఆంక్షలను సడలించాలని కోరారు. 1965-2000 మధ్య కాలంలో ఈఏఎస్ శర్మ ఆంద్ర క్యాడర్ ఐఏఎస్ గా పని చేశారు. మినిస్టరీ ఆఫ్ పవర్, ఫైనాన్స్ శాఖలలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
పునరావాస సహాయం అందని వారి చాలా మంది ఉన్నారు. ఉదయం డబ్బులు ఇచ్చి సాయంత్రానికి ఊరు ఖాళీ చేయగలమా? అంటూ ప్రశ్నిస్తున్న వారి ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ఆ ప్రాంత వాసులకు భరోసా కల్పించవలసిన అవసరం ఉంది. లేకుంటే వారి బాధ అరణ్య రోదనగా మిగలనుంది. దీంతో వారు జగన్ గారూ.. మా కన్నీళ్లు కనిపించవా..మా ఏడుపులు వినిపించవా? అంటూ దీనంగా వేడుకుంటున్నారు.