చదువు, సంస్కారంతో పాటు సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తికి అలాంటి వ్యక్తేతోడైతే ఆ అనుబంధంతో చిరస్మరణీయమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు.అలాంటి మహనీయులే పద్మశ్రీ ఎన్ .టి. రామారావు, పద్మశ్రీ డి.వి.ఎస్. రాజు.
ఎన్టీ రామారావు గారికి ఆత్మీయ సోదరుడిగా డివిఎస్ రాజు గారు తారసపడ్డారు. నిర్మాతగా, లితో ప్రెస్ అధినేతగా, సమాజ సేవకుడిగా, మంచి పాలనా దక్షుడిగా డివిఎస్ రాజుగారికి పేరు. తెలుగు సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగి ఆ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వారిలో డివిఎస్ రాజు ముందు ఉంటారు.డివిఎస్ రాజు 96వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనమిది.
1952 ఎన్టీఆర్ నేషనల్ ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థ ను ప్రారంభించి టి. ప్రకాశ రావు దర్శకత్వంలో ‘పిచ్చి పుల్లయ్య’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సమయమది. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు సంగీత దర్శకుడు, ఎన్టీఆర్ రూమ్మేట్ టి.వి. రాజు సినీ లితో ప్రింటింగ్ ప్రెస్ అధినేత డి.వి.ఎస్. రాజును రామారావు గారికి పరిచయం చేశారు. ఆ వేళావిశేషమేమో వారిద్దరి మధ్య తెలియని అనుబంధం, ఆత్మీయత పెనవేసుకుపోయాయి.
ఎన్టీఆర్ కు తమ్ముడు త్రివిక్రమరావు అంటే అమితమైన వల్లమాలిన ప్రేమ. డివిఎస్ రాజును కూడా ఎన్టీఆర్ స్వంత తమ్ముడిలా అభిమానించి ఆదరించారు. ఆ సినిమా తర్వాత ఇంకో సినిమా చేసే సమయంలో తన తమ్ముడితో రాజుకు కబురు పంపారు. తాము నిర్మించే రెండో సినిమాలో నిర్మాణ భాగస్వామిగా చేర్చుకున్నారు. అలాంటి అవకాశం, అదృష్టం వస్తుందని డీవీఎస్ రాజు ఊహించలేదు. అలా నిర్మించిందే ‘తోడు దొంగలు’ సినిమా. అదే సమయంలో రాయలసీమలో కరవు విలయతాండవం చేస్తోంది.
అక్కడి ప్రజలు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రముఖ జర్నలిస్టు నార్ల వెంకటేశ్వర రావు సలహాతో ఎన్టీఆర్ ప్రజలను ఆదుకోవాలనుకున్నారు.’ఆంధ్రప్రభ – రాయలసీమ కరవు నివారణ నిధి’ పేరుతో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తమ్ముడు త్రివిక్రమరావు, డివిఎస్ రాజు సహకారంతో విరాళాలు సేకరించి ప్రజలకు అందించారు.
అప్పటినుంచి ఎన్టీఆర్ ఏది తలపెట్టినా డివిఎస్ ఆయనను వెన్నంటే ఉండేవారు. ఆ తరువాత స్వంత నిర్మాణ సంస్థను ప్రారంభించమని, తాము అండగా ఉంటామని రామారావు హామీ ఇచ్చారు. ఇది కూడా డివిఎస్ ఊహించలేదు.1964లో డివిఎస్ ప్రొడక్షన్స్ సంస్థను రామారావే స్వయంగా ప్రారంభించడంతో పాటు తొలి సినిమాలో కథానాయకుడిగా నటించారు. అలా నిర్మించిన మంగమ్మశపథం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
డివిఎస్ వ్యక్తిత్వం సినిమా రంగంలోని పెద్దలను ఆకట్టుకుంది. ఆయన నిజాయితీ, నిబద్దత, నిరాడంబర త, నిరుపమానమైన సేవా గుణం అనేక సంస్థలలో ఆయనను భాగస్వామిని చేశాయి. తెలుగు నిర్మాతల మండలి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి, ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ, జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్, ఫిలిం నగర్ సహకార గృహ నిర్మాణ సంస్థలు నేటికీ విజయవంతంగా కొనసాగుతున్నాయంటే అది డివిఎస్ సమర్ధత, పటిష్టమైన ప్రణాళికతో వేసిన బీజాలే.
1982లో డివిఎస్ జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థకు చైర్మన్ గా ఉన్నారు. రిచర్డ్ అటెన్బరో దర్శకత్వంలో మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా గాంధీ సినిమాని తెరకెక్కించారు. దీన్ని మన దేశంతో పాటు బ్రిటన్ కూడా కలిసి నిర్మించారు. ఈ చిత్ర లాభాల్లో కొంత భాగం భారతీయ సినిమా కార్మికుల కోసం ఇవ్వాలని డివిఎస్ పట్టుపట్టి మరీ సాధించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డివిఎస్, రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థకు ఛైర్మన్ గా వున్నారు.
అప్పుడు డివిఎస్ ఆధ్వర్యంలో నే తెలుగు లలిత కళా తోరణం రూపుదిద్దుకుంది. ఫిల్మోత్సవ్ ’86ను అత్యంత సమర్ధంగా అనితర సాధ్యంగా లలిత కళాతోరణంలోనే నిర్వహించారు. ఈ చిత్రోత్సవంలో అశోక్ కుమార్, రాజ్ కపూర్, ఎమ్ .జి . రామ చంద్రన్, కన్నడ రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్ లాంటి హేమాహేమీలైన హీరోలు పాల్గొన్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా భారతీయ సినిమా ప్రగతికి తోడ్పడిన వ్యక్తి డివిఎస్ రాజు. ఆయన సేవలను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1988లో రఘుపతి వెంకయ్య అవార్డుతో ఆయనను సత్కరించారు.1995లో దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ డి.వి.ఎస్.రాజు ను “సినీ భీష్మ ” అవార్డుతో ఘనంగా సత్కరించింది .
2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి కె .ఆర్. నారాయణన్ పద్మశ్రీ అవార్డు ను డివిఎస్ రాజుకు ప్రదానం చేశారు. 1928 డిసెంబర్ 13న తూర్పు గోదావరి జిల్లా అల్లవరం లో జన్మిచిన డి.వి.ఎస్. రాజు తన జీవన ప్రస్థానంలో చెరిగిపోని కీర్తిని సంపాదించి 2010 నవంబర్ 13న హైదరాబాద్ లో ఇహలోక యాత్ర ముగించారు . అలా డి.వి.ఎస్. రాజు తన జన్మను సార్థకం చేసుకుని చరితార్థుడయ్యారు.