సీనియర్ సినిమా జర్నలిస్టు, హాసం పత్రిక మాజీ సంపాదకుడు హాసం రాజా గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సంగీత పరమైన సినీ విశ్లేషణలకు హాసం రాజా పెట్టింది పేరు. వార్త పత్రికలో సినిమా ఇన్ ఛార్జిగా పనిచేశారు. ఫ్రీలాన్సర్ గా అనేక పత్రికల్లో వ్యాసాలు రాశారు. హాస్య సంగీత పత్రిక. శాంతా బయోటెక్ కంపెనీ వ్యవస్థాపకుడు కె.ఇ.వరప్రసాద్ రెడ్డి అధిపతి స్ఠాపించిన ‘హాసం’ పత్రికకు ఆయన సంపాదకుడిగా పనిచేశారు. ఈ పత్రిక అక్టోబరు 2001 నుంచి పక్ష పత్రికగా వెలువడింది.
శ్రీకాకుళంలో పుట్టి..
హాసం రాజా అసలు పేరు మంగు నరసింహస్వామి (70). శ్రీకాకుళంలో జూన్ 10, 1951లో పుట్టారు. ఆయన తండ్రి అయిన ఎమ్.వి.ఆర్. పంతులు శ్రీకాకుళంలో మంచి పేరున్న లాయర్. అతని తల్లి సుభద్రా దేవి మంచి వైణికురాలు. ఆయన బీ.కామ్ పూర్తిచేశాక పాటలపై దృష్టి పెట్టారు. చిన్న వయసు నుంచే సినిమాలు, పాటలపై ఆసక్తి ఉండేది. అలా సంగీత విమర్శకుడి పేరు తెచ్చుకున్నారు. సినీ సంగీతం పై వివిధ పత్రికల్లో వ్యాసాలను రాసి కొత్త వొరవడికి శ్రీకారం చుట్టారు.
హాసం సంపాదకుడిగా..
హాసం పత్రిక సంపాదకుడిగా రాజాకు మంచి పేరు వచ్చింది. భారతీయ సంగీతానికీ, హాస్యానికీ అంకితమైన తెలుగు పత్రిక ఇది. దీనికి సంపాదకుడిగా బాధ్యతలు చేపట్టాక రాజా కాస్తా హాసం రాజాగా పేరు తెచ్చుకున్నారు. పత్రికలకు ఆదరణ తగ్గాక 2004లోనే ఈ పత్రిక ఆగిపోయింది. మ్యూజికాలజిస్ట్గా సినిమా పాటలను విశ్లేషించడంలో రాజా ప్రత్యేకత చూపేవారు. అంతేకాకుండా ఆ పాటల తమిళ, హిందీ, కన్నడ, బెంగాళీ, ఇంగ్లీషు పాటల మూలాలను వెలికితీసి పరిశోధించి పాఠకులకు అందించేవారు. ఢిల్లీ తెలుగు అకాడమీ గతంలో ఉగాది పురస్కారాన్ని కూడా హాసం రాజాకు అందచేసి సన్మానించింది. తెలుగు సినిమా పాటలు, వాటి రాగాలపై ‘ఆపాత మధురం’ అనే పుస్తకాన్ని కూడా ఆయన రాశారు.
సినిమా పాటలను పరిశోధనాంశంగా తీసుకున్న కొద్ది వ్యక్తుల్లో రాజా ఒకరు. పాటలకు సంబంధించి మీడియా రంగంలో ఎవరికి ఎలాంటి సందేహం వచ్చినా రాజాను సంప్రదించేవారు. పాటలపై మీకు ఎందుకింత మమకారం అని ఓ సందర్భంలో ఆయనను ప్రశ్నించినప్పుడు ‘తెలుగు సినిమా పాటలకు సంబంధించిన పూర్తి వివరాలు అందరికీ అందుబాటులో ఉండాలనేది నా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే పాటల పై పరిశోధన చేశాను. ప్రతి శ్రోతకీ పాటల వివరాలు అందుబాటులో ఉండటానికి రాజా మ్యూజిక్ బ్యాంక్.కామ్ ఏర్పాటు చేసి అందులో ఆ సమాచారాన్ని ఇస్తున్నాను. దాదాపు 40వేల పాటలకు సంబంధించిన పూర్తి వివరాలను నేను సేకరించాను’ అని వివరించారు.
ఆయన ఒక్కోసారి తాత్వికంగా మాట్లాడేవారు. ‘నా పుట్టుక తల్లిదండ్రులకు సంబంధించింది.. నా చావు భార్యాబిడ్డలకు చెందింది.. నా బతుకు తెలుగు సినిమా పాటకి అంకితం’ అంటూ వ్యాఖ్యానించారాయన. భావి తరాలకు ఉపయోగపడేలా తెలుగు సినిమా పాటలపై ప్రభుత్వం ఓ కమిటీ వేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనేవారు. తన పాటల నిధిని ప్రభుత్వానికి ఇవ్వడానికి కూడా తాను సిద్ధమేనని ప్రకటించారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవాలనుకుంటున్నట్టు కూడా చెప్పారు. పాటలకు తాను ఇంత సమాచారాన్ని సేకరించగలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాజా అనేవారు. హాసం రాజా లాంటి ఓ ప్రత్యేకత ఉన్న జర్నలిస్టును తెలుగు సినిమా రంగం కోల్పోయింది.. తెలుగు పాట ఓ వెలుగును కోల్పోయింది.
అవార్డులు, రివార్డులు
* సంగీత అభిమానల మన్ననలు పొందేలా హాసం పత్రికను నడిపినందుకు యూరోపియన్ తెలుగు అసోసియేషన్ (ఈటా) నుంచి అవార్డు.
* సంగీతపరమైన జర్నలిజంలో సేవలందించినందుకు మద్రాసు తెలుగు అకాడమీ నుంచి సమైక్య భారత్ గౌరవ సత్కారం.
* టీవీ నంది అవార్డులలో భాగంగా 2006 సంవత్సరానికి ‘గుర్తుకొస్తున్నాయి’ కార్యక్రమానికి ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం గా బంగారు నంది పురస్కారం. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునల చేతుల మీదుగా సన్మానం.
* శ్రీకాకుళం యునియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నుంచి సత్కారం.
* ఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి ఉగాది పురస్కారం.
-హేమసుందర్
Must Read ;- సినిమా రైతు ‘వేదం’ నాగయ్య ఇకలేరు