రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నదీ జలాల బురద రాజకీయ నడుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు మీద బురద జల్లడమే లక్ష్యంగా.. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ జల వివాదాలను తెరపైకి తీసుకొచ్చాయి. అయితే చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అదే సమయంలో ఆయన ఏపీకే నష్టం చేశారనేది వైసీపీ వాదన. రాష్ట్ర విభజన సమయం నుంచి నదీ జలాల పంపకాలు.. ప్రాజెక్టుల నిర్మాణం జరిగిన తీరును గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసిందెవరు.. నష్టం చేసిందెవరో స్పష్టంగా తెలిసిపోతుంది.
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. కృష్ణా నదీ జలాల పంపిణిపై ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర జలవనరుల మంత్రి నాయకత్వంలో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్న మీటింగ్లో.. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 811 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి ఒప్పందం జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం నవ్వాంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకోవాలి. అంటే ఏపీకి 64 శాతం, తెలంగాణకు 36 శాతం వాటా దక్కాయి. కృష్ణా జలాల్లో ఎక్కువ వాటా సాధించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడింది అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అదే సమయంలో ముచ్చుమర్రి ఎత్తిపోత పథకం పనులు ప్రారంభించడంతో పాటు పూర్తి చేసి.. హంద్రీ-నీవా కాలువల ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తరు, కడప జిల్లాలకు నీళ్లిచ్చిన ఘనత కూడా చంద్రబాబు సొంతం. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరం ప్రాజెక్టు పనులను మళ్లీ పట్టాలెక్కించి.. శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
ఏపీ వాటర్ హిస్టరీలో మరో కోణం చూస్తే.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఏపీ సీఎంగా ఉన్న జగన్రెడ్డి.. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.7 మీటర్ల నుంచి 41.5 మీటర్లకు తగ్గించారు. తాను చెప్పడం వల్లనే జగన్ పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించారని.. అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా చెప్పారు. కేసీఆర్తో స్నేహం కోసమో, తెలంగాణలోని ఆస్తులను రక్షించుకోవడానికో గానీ.. ఏపీకి నష్టం చేసేలా.. పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించాలనే నిర్ణయం తీసుకొన్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇక రివర్స్ టెండర్ల పేరుతో ఆలస్యం చేయడంతో వరదలకు ప్రాజెక్టులో కీలక భాగాలు డ్యామేజ్ అయ్యాయి. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని చేతులెత్తేసింది.. జగన్ ప్రభుత్వమే. ఇదే వైసీపీ హయాంలో ముచ్చుమర్రి ఎత్తిపోతలను నిర్లక్ష్యం చేసి.. రాయలసీమ లిఫ్ట్ పేరుతో వెయ్యి కోట్లు ఖర్చు చేశారు. ఎన్జీటీ ఆదేశాలతో 2021లో రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపేసిన చరిత్ర జగన్రెడ్డిది. రాష్ట్రానికి ముఖ్యంగా రాయలసీమకు నష్టం జరిగింది.. జగన్మోహన్రెడ్డి హయాంలోనే.. కానీ వైసీపీ నేతలు, ఆ పార్టీకి వంత పాడే బ్లూ మీడియా గోబెల్స్.. సోషల్ మీడియా నీలి కూలీలు.. మాత్రం జగన్ తప్పుల్ని చంద్రబాబు ఖాతాలో వేయడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఎవరెన్ని చెప్పినా.. జగన్ చేసిన నష్టాలు.. చంద్రబాబు పూర్తి చేసిన ప్రాజెక్టుల కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి.











