అప్పటిదాకా పోలీసు అధికారిగా, పోలీసు అధికారుల సంఘంలో కీలక సభ్యుడిగా కొనసాగిన గోరంట్ల మాధవ్.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో వాగ్వాదం నేపథ్యంలో ఒక్కసారిగా హీరో అయినట్లుగా ఫీలైపోయారు. సినిమాల్లో పోలీసు అధికారి పాత్రల్లో కనిపించే నటుల మాదిరే.. నిజ జీవితంలోనూ రాజకీయ నేతలపై మీసం మెలేసిన గోరంట్ల తన పోలీసు డ్యూటీకి శాశ్వతంగా వీడ్కోలు పలికి నేరుగా వైసీపీలో చేరిపోయారు. మీసాలు మెలేసే వారికి వైసీపీలో బాగానే ప్రాధాన్యం దక్కుతోంది కదా. ఆ మాట నిజమేనన్నట్లుగా గోరంట్లకు కూడా జగన్ అధిక ప్రాధాన్యమిచ్చారు. రాజకీయాల్లో ప్రవేశించిన నెలల వ్యవధిలోనే ఏకంగా హిందూపురం లోక్ సభ సీటిచ్చి ఏకంగా ఎంపీని చేసి ఢిల్లీకి పంపారు. సరే.. ఓ పార్లమెంటు సభ్యుడికి ఏ పాటి ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. అదే సమయంలో ఆ పదవికి ఉన్న ఔన్నత్యానికి తూట్లు పొడిచేలా వ్యవహరించే వారికి ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయో కూడా తెలిసిందే కదా. ఇప్పుడు మీసాలు మెలేస్తూ సాగుతున్న గోరంట్లకు కూడా అలాంటి అనుభవమే ఎదురు కానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
రఘురామకు బెదిరింపులు
గోరంట్ల మాదిరే రఘురామకృష్ణరాజు కూడా వైసీపీ తరఫునే ఎంపీగా ఎన్నికయ్యారు కదా. అయితే పార్టీ నిర్ణయాలు, జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తనదైన శైలి అసహనం వ్యక్తం చేస్తున్న రఘురామ.. జగన్ సర్కారుపై పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ ఎంపీగా ఉన్న సహచర రాజకీయ నేతను బెదిరిస్తే ఏమవుతుందన్న విషయం గోరంట్లకు అంతగా తెలిసినట్లు లేదు. ఎందుకంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తామే.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా తమతో సఖ్యతగా ఉంటోంది అన్న భావనలో ఉన్న గోరంట్ల.. మీసాలు మెలేసి బెదిరింపులకు పాల్పడే తన వాస్తవ రూపాన్ని పార్లమెంటు వేదికగా బయటపెట్టుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. ఈ నెల 3న రఘురామకు ఎదురైన గోరంట్ల మీసం మెలేశారట. పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా మీసం మెలేసిన గోరంట్ల.. ఇకపై జగన్ పై విమర్శలు సంధిస్తే.. అంతు చూస్తానని బెదిరించారట. ఈ ఘటనపై రఘురామ తనదైన శైలిలో అప్పటికి సైలెంట్ గానే వెళ్లిపోయినా.. ఆ తర్వాత ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు స్పీకర్ ఓం బిర్లాకు కూడా లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సెంట్రల్ హాల్ లోని వీడియో ఫుటేజీని పరిశీలిస్తే.. గోరంట్ల తనను ఎంతగా బెదిరించారో తెలుస్తుందని కూడా ఆ ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు.
మోదీ స్పందించారు
రఘురామ ఫిర్యాదుపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్పందించారట. ఈ మేరకు రఘురామ ఫిర్యాదు అందిన విషయాన్ని తెలుపుతూ మోదీ ఆయనకు తన సంతకంతో కూడిన అక్నాలెడ్జ్ మెంట్ ను పంపారట. ఈ లేఖ అందిన మరుక్షణమే రంగంలోకి దిగిపోయిన రఘురామ.. గోరంట్ల బెదిరింపులపై లోక్ సభ స్పీకర్ కూడా స్పందించేలా మరోమారు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. సాధారణంగా ఎంపీలే కాకుండా ప్రధాన మంత్రి కార్యాలయానికి ఏ లేఖ వచ్చినా.. అందులోని అధికారులు ఆయా లేఖలను పరిశీలించి స్పందించాల్సినవేవో, స్పందించాల్సిన అవసరం లేనివేవో గుర్తించి వర్గీకరణ చేస్తారు. స్పందించాల్సిన వాటిలోనూ వివిధ కేటగిరీలుగా వర్గీకరించి.. పీఎంఓ స్పందించినట్లుగా లేఖలు రాస్తుంటారు. అయితే ప్రధాని సంతకంతో కూడా రిప్లైలు చాలా తక్కువగా వస్తుంటాయి. ఏదేని కీలక అంశమైతేనే పీఎం సంతకంతో కూడిన జవాబు వస్తుంది. అంటే.. రఘురామ ఫిర్యాదును పీఎంఓ కీలకమైనదిగానే గుర్తించినట్టే కదా. మరి రఘురామపై మీసం మెలేసిన గోరంట్ల పరిస్థితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.
Must Read ;- టీడీపీది లాజిక్కే.. ఏ2కు పీఏసీ పదవి ఎలా?