నిజమే మరి.. తీవ్రమైన ఆర్థిక నేరాలతో కూడిన జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డిని కేంద్ర ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యుడిగా నియమించడం ద్వారా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపిస్తోందన్న అంశంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన టీడీపీ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందేనని కూడా డిమాండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రమైన ఆర్థిక నేరాల కేసులో నేడో, రేపో సాయిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉందని, ఈడీ విచారణలకూ హాజరు కావాల్సి ఉందని.. కేసుల విచారణ ముగిసో, లేదంటో బెయిల్ రద్దు అయితేనో.. మళ్లీ జైలుకు వెళ్లే నేతకు పీఏసీ సభ్యుడి లాంటి కీలక పదవిని ఎలా అప్పగిస్తారని కూడా ఫరూఖ్ కీలక ప్రశ్నలు సంధించారు.
జగన్ కేసుల్లో ఏ2గా సాయిరెడ్డి
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష కోట్ల మేర అక్రమాస్తులను కూడబెట్టారని, దీనిపై విచారణ జరపాంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హోదాలో శంకర్ రావు చేసిన ఫిర్యాదుతో జగన్ పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారంలో సీబీఐ ఏకంగా 11 కేసులను నమోదు చేసింది. ఈ కేసులన్నింటిలోనూ ఏ1గా జగన్ ఉంటే.. ఏ2గా విజయసాయిరెడ్డే ఉన్నారు. ఇక సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కూడా ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసింది. ఇందులోనూ జగన్ ఏ1 అయితే ఏ2గా సాయిరెడ్డే ఉన్నారు. మొత్తంగా జగన్ పై నమోదైన దాదాపుగా అన్ని కేసుల్లోనూ సాయిరెడ్ది కీలక నిందితుడిగానే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈడీ కేసుల విచారణ తొలుత జరిగితే తాను ఎక్కడ అరెస్ట్ అవుతానోనన్న భయంతో ముందుగా సీబీఐ కేసుల విచారణను జరపాలని సాయిరెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అందుకు ససేమిరా అన్న హైకోర్టు ముందుగా ఈడీ కేసుల విచారణే జరుగుతుందని తేల్చి చెప్పేసింది. మరోవైపు సాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ కూడా సీబీఐ కోర్టులో విచారణ సాగుతోంది. అటు ఈడీ విచారణ ముగిసో, లేదంటే ఇటు బెయిల్ రద్దు అయితేనో.. సాయిరెడ్డి మళ్లీ జైలుకు వెళ్లక తప్పని స్థితిలో ఉన్నారనే చెప్పాలి.
ఫరూఖ్ ఏమన్నారంటే..?
మంగళవారం నాడు విజయసాయిరెడ్డిని పీఏసీ సభ్యుడిగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆధిర్ రంజన్ చౌధురి నేతృత్వంలోని పీఏసీలో సభ్యులుగా కొనసాగుతున్న ఇద్దరు నేతలు ఇటీవలే కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ఖాళీలను భర్తీ చేస్తూ కేంద్రం సాయిరెడ్డితో పాటు మరో ఎంపీని కొత్తగా పీఏసీలోకి తీసుకుంది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా విస్మయం వ్యక్తమైంది. తీవ్రమైన ఆర్థిక నేరాల కేసులో కీలక నిందితుడిగా ఉన్న సాయిరెడ్డి కేంద్ర పద్దులను ఎలా పరిశీలిస్తారన్న వాదనలు వినిపించాయి. ఇదే అంశాన్ని ప్రస్తావించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్.. అసలు పీఏసీలోకి సాయిరెడ్డికి ఎంట్రీ ఇచ్చే అర్హతే లేదన్నారు. వేల కోట్ల అక్రమ సంపాదనకు సంబంధించిన కేసుల్లో నిందితుడు ప్రభుత్వ జమా ఖర్చులను ఎలా పరిశీలిస్తారని ఆయన ప్రశ్నించారు. సాయిరెడ్డికి పీఏసీ పదవి అంటే.. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టేనని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా తీవ్ర ఆర్థిక నేరాల్లో చిక్కుకున్న నేతకు పీఏసీ సభ్యత్వం కట్టబెట్టి కేంద్ర ప్రభుత్వం దేశానికి ఎలాంటి సందేశం ఇస్తోందని కూడా ఆయన ప్రశ్నించారు. ఈడీ కేసులోనో, సీబీఐ కేసులోనో సాయిరెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమేనని, అలాంటి నేతకు పీఏసీ సభ్యత్వం ముమ్మాటికీ తప్పేనని ఫరూఖ్ త్చేల్చేశారు.
Must Read ;- ఈడీ అంటే అంత భయమెందుకో?