ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో ఓ ప్రతిష్టాక ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి హీరో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రాన్ని ఈ సంస్థ నిర్మించింది. ఇది సోషియో ఫాంటసీ చిత్రం. ఈ సినిమాకి సీక్వెల్ తీయనున్నట్లు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ప్రభాస్ తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తీయబోయే చిత్రం కూడా సోషియో ఫాంటసీనే. కొత్త కథల్లోకి వెళ్లడమా, ఉన్న కథనే సీక్వెల్ గా తీయడమా అనే తర్జన భర్జన జరిగినట్లు సమాచారం.
ఇందులో అమితాబ్ బచ్చన్ లాంటి అగ్రనటుడు కూడా ఇందులో నటించడానికి అంగీకరించారు. దీంతో ఈ సినిమా కథ మీద భారీగా కసరత్తులు జరుగుతున్నాయి. దీనికి మరో అగ్రదర్శకుడు సింగీతం శ్రీనివాసరావు హస్తం కూడా తోడైంది. ఇది సీక్వెల్ గా కాకపోయినా అందులోని కొన్ని పాత్రలకు కొనసాగింపు ఉండాలనే ఆలోచన జరుగుతున్నట్లు సమాచారం. ఇలాంటి విషయాల్లో కె. రాఘవేంద్రరావు హస్తం కూడా ఉంటే మంచిదన్న అభిప్రాయానికి నిర్మాత సి. అశ్వనీదత్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఇందులో వచ్చే ఓ కీలక సన్నివేశం ఎలా ఉంటే బాగుంటుందో రాఘవేంద్రరావును అడిగారట. ఇంతకుముందు రాఘవేంద్రరావు బాహుబలి చిత్రానికి కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. పైగా భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నందున అవసరమైన అన్ని జాగ్రత్తలూ అశ్వనీదత్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్క అమితాబ్ బచ్చన్ కే రూ. 25 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. అలాగే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే కూడా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
మరి ఇంతమంది హస్తం ఈ సినిమా నిర్మాణంలో ఉంది. సైన్స్ ఫిక్షన్ కథా వస్తువు కాబట్టి ఎక్కువ భాగం గ్రీన్ మ్యాట్ లోనే నిర్మాణం కావలసి ఉంటుంది. అందుకు అనుగుణంగా రామోజీ ఫిలింసిటీ ఉండనే ఉంది. పక్కా స్క్రిప్టుతోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ‘మహానటి’ తర్వాత నాగ్ అశ్విన్ రూపొందించబోతున్న సినిమా ఇది. దీనికి స్వప్నాదత్, ప్రియాంకా దత్ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు ఉంది. ఆరోజున ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.