నాన్న మంత్రి కాగానే.. కొడుకు బెంజికారులో తిరగాలని ముచ్చటపడితే తప్పులేదు! ఆ కారును సంపాదించాలని అనుకుంటే అభిమానులు కూడా హర్షించేవారు. పైగా సదరు మంత్రిగారు ఆ కారు సొంతంగా కొనుక్కోలేనంత పేదవారు కూడా కాదు. అయితే ఆయన ఓ బెంజికారును కానుకగా పుచ్చుకోవాలనుకున్నారు! సాక్షాత్తూ మంత్రిగారి తనయుడు కానుక పుచ్చుకోవాలని సంకల్పిస్తే.. కానుకలకు కొదవేముంటుంది.
సరిగ్గా అప్పుడు తెలుకపల్లి కార్తీక్ రంగప్రవేశం చేశాడు. పత్రికల్లో వస్తున్న వార్తలను బట్టి అర్థమవుతున్నదేంటంటే.. కార్తీక్ ఈఎస్ఐ ఆస్పత్రులకు సరఫరా చేస్తుండే ఒక కాంట్రాక్టరు. ప్రభుత్వంలోని పెద్దలను ప్రసన్నం చేసుకుని.. కాంట్రాక్టులు పొందుతూ కమిషన్లు ముట్టజెబుతూ ఉండే దళారీ. ఆయన నానేష్ అనే ఫైనాన్స్ కంపెనీ వద్ద రుణం తీసుకుని మరీ బెంజి కారు కొని, మంత్రి తనయుడు ఈశ్వర్ కు పుట్టినరోజు కానుకగా ఇచ్చారు. షోరూంలోనే తన స్వహస్తాలతో ఈ కారు తాళం నమూనాని మంత్రి తనయుడికి అందజేయడం జరిగింది. (ఆ ఫోటో కూడా తెలుగుదేశం బయటపెట్టిన ఆధారాల్లో ఉంది.)
కారులో కొడుకు షికారు.. కనబళ్లేదా జయరాం గారూ!
బెంజికారు ముచ్చట తీరింది. ఈశ్వర్ సరదాల విహారాలు అన్నింటికీ.. ఆ కారు వేదిక అయింది. అసలే కొత్త కారు ముచ్చట.. మిత్రులతో కలిసి ‘ధీర ధీర..’ అని పాటలు ప్లే చేసుకుంటూ.. ఆ బెంజి కారులో చక్కర్లు కొడుతూ వీడియోలు తీసుకుని కూడా షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోలు అన్నీ కూడా బయటకు వచ్చాయి. (లియో నెట్ వర్క్ యూట్యూబ్ ఛానెల్ లో చూడండి)
ఈలోగా ఒక పరిణామం జరిగింది. గత ప్రభుత్వపు హయాంలో నిర్ణయాలపై నమోదైన కేసులు వాటి విచారణల్లో భాగంగా.. ఈఎస్ఐ స్కాం సంచలనం అయిన సంగతి అందరికీ తెలుసు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ను అమానుషంగా అరెస్టు చేసినది ఈ కేసులోనే! తెలుకపల్లి కార్తీక్ కి కూడా ఈ స్కాంతో ప్రమేయం ఉన్నదని విచారణలో బయటకు వచ్చింది. జూన్ 3 వతేదీన ఈ స్కాం నిందితుల్లో కార్తీక్ పేరును ఏ14 గా ఏసీబీ నమోదు చేసింది. అతను అరెస్టయ్యాడు. తర్వాత బెయిల్ కూడా వచ్చింది.
జులైలో గుమ్మనూరు ఈశ్వర్ పెళ్లి జరిగింది. ఈ యువనేత పెళ్లి వేడుకల్లో కూడా ప్రధానంనగా ఈ కారునే వాడుకున్నాడు. ఇలా అనడం ఏదో అతికినట్లుగా ఉంటుంది గానీ.. అది తన కారే (అనే భావనలో ఉన్నాడు గనుక) గనుక.. యథేచ్ఛగా వాడుకున్నాడు.
ఇప్పుడు అసలు గొడవ మొదలైంది. ఆరోపణలు విచారణకు డిమాండ్ చేయడాలు తెలుగుదేశం వైపునుంచి జరుగుతున్నాయి. అదే సమయంలో.. అసలు ఆ ఆరోపణల్లో విషయమే లేదని.. మంత్రి సహజశైలిలో కొట్టి పారేస్తున్నారు.

తెలుగుదేశం ఏమంటోంది..
ఈశ్వర్ తండ్రి గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ మంత్రి గనుక.. ఈఎస్ఐ ఆస్పత్రులకు కాంట్రాక్టరు అయిన తెలుకపల్లి కార్తీక్ కానుకగా ఇచ్చిన కారు తీసుకున్నాడు గనుక.. జయరాంకు కార్తీక్ బినామీ అంటుంది తెలుగుదేశం.
కనుక- అసలు ఈఎస్ఐ స్కాంలో మంత్రి జయరాంకే పాత్ర ఉన్నదని, ఏ-14 గా కార్తీక్ ఉన్నప్పటికీ.. అసలు నిందితుడు జయరామే అన్నది వారి ఆరోపణ. అయ్యన్నపాత్రుడు నాటకీయంగా.. ప్రెస్ మీట్ నుంచి ఏసీబీ టోల్ఫ్రీ నెంబరుకు ఫోనుచేసి.. సమాచారం కూడా ఇచ్చారు. తద్వారా.. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబరుకు అవినీతి గురించి ఫిర్యాదుచేస్తే.. 24 గంటల్లో పరిష్కరిస్తాం అన్న జగన్ మాటలను ఆయన ఎద్దేవా చేశారు.
మంత్రి జయరాం ఏమంటున్నారు?
నా కొడుకుకు రాష్ట్రంలో లక్షలమంది ఫ్యాన్స్ ఉన్నారు, వారిలో ఒక ఫ్యాన్ నా కొడుకు చేతిమీదుగా బెంజికారు తాళం చెవి తీసుకున్నాడు అంతే.. అని జయరాం కొట్టి పారేస్తున్నారు. లక్షల మంది ఫ్యాన్స్, లేదా ఫాలోయర్స్ ఉండడానికి ఆయన కుమారుడు ఏ స్థాయి జాతి నాయకుడో అర్థం కాని సంగతి. ఆ కుర్రాడి అఫీషియల్ ఫేస్ బుక్ పేజీకి ఉన్నదతి 4.5 వేల లైక్ లు మాత్రమే. ఈశ్వర్ అన్న పేరుతో.. అభిమానులు నడపించే ఫేస్ బుక్ ఖాతాలు ఉన్నాయి గానీ.. ఎందులోనూ 5 వేల సంఖ్యను చేరుకున్న అభిమానులు లేరు.
కానీ, పుత్రోత్సాహం కదా.. తన కొడుకుకు రాష్ట్రంలో లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారని తండ్రి అనుకోవడం సహజం. అయితే మాత్రం.. తాళం చెవి తీసుకున్న ఫ్యాన్.. ఈఎస్ఐ ఆస్పత్రి కాంట్రాక్టరు కావడమే తమాషా. మంత్రి మాట నిజమే అనుకుందాం. ఫ్యాన్ కార్తీక్, ఈశ్వర్ చేతుల మీదుగా పుచ్చుకున్నాడనే అనుకుందాం. ఆ ఫోటో చూస్తే మాత్రం.. ఇచ్చుతున్నది కార్తీక్ అని.. పుచ్చుకుంటున్నది ఈశ్వర్ అని అనిపిస్తుంది. హావభావాలు, భంగిమలు అలా ఉన్నాయి. మన అభిప్రాయం కూడా తప్పే అనుకుందాం. ఫ్యాన్ కు తాళం చెవి తన చేతుల మీదుగా ఇచ్చేసిన తర్వాత.. నెలలతరబడి.. అదే కారును ఈశ్వర్ వాడుకుంటూనే ఉన్నాడు. అందులో తిరుగుతూనే పెళ్లి సంబరాలు కూడా చేసుకున్నాడు. వీటన్నింటికీ మరి మంత్రిగారు ఏం చెప్తారు. కారు ఎక్కడ ఉందో చూసుకోమని కూడా అన్నారు. మంత్రిగారు ధైర్యంగా కుమారుడి పెళ్లి వీడియోలు సాక్ష్యంగా ఇస్తే ఆ సంగతి కూడా బయటపడుతుంది.
ఆ కారు ఎవ్వరి పేరిట రిజిస్టరు అయిందో చూసుకోండి అనేది ఆయన సవాలు. అసలు నిందే అది అయినప్పుడు.. జవాబు కూడా అదే చెప్తే ఎలా?

ఈ లోగా ఇంకో తమాషా జరిగింది. వివాదం బయటకు వచ్చిన తర్వాత.. నానేష్ ఫైనాన్స్ కంపెనీ సెప్టెంబరు 18వ తేదీతో ఒక ఉత్తరం విడుదల చేసింది. ఆ కారును సెప్టెంబరు 11నే తాము స్వాధీనం చేసుకున్నామని (బహుశా రుణం చెల్లింపులు లేనందువల్ల) అనేది ఆ లేఖలోని సారాంశం.
ఇది హడావుడిగా బనాయించిన ఉత్తరం అని అనిపిస్తోంది. ఇన్నాళ్లూ వారి రుణానికి ఎవరు కంతులు కడుతూ వచ్చారో తేలిగ్గా దొరుకుతుంది. ఎన్ని నెలలనుంచి కట్టడం లేదో కూడా దొరుకుతుంది. ఆ సంస్థ నిబంధనలు కూడా తెలుస్తాయి. కాస్త లోతుగా వెళ్తే.. ఇది బనాయించిన ఉత్తరమా? నిజమైనదేనా? అనేది తెలుస్తుంది. బనాయించిన ఉత్తరం అని మనకు ఎందుకు అనుమానం వస్తున్నదంటే.. నానేష్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే పేరుతో ఉన్న ఈ లెటర్ హెడ్ లో కనీసం వారి చిరునామా కూడా లేదు. ఏ ఫైనాన్స్ కంపెనీ అయినా.. కనీసం తమ చిరునామా కూడా బయటపెట్టుకోకుండా.. గుట్టుచప్పుడు కాని రహస్య వ్యాపారం చేస్తుంటుందా?
కారు కార్తీక్ కొన్నాడన్నది మంత్రి చెప్పక్కర్లేదు.. తెదేపానే చెప్పింది. ఇప్పుడు వదిలించుకుని ఉండొచ్చు గానీ.. ఇన్నాళ్లూ మంత్రి కొడుకు వాడుతున్నాడనే ఆధారాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక తేలవలసింది తెదేపా ఆరోపణల సంగతి.
తెదేపా ఆరోపణలు కరక్టేనా?
ఈఎస్ఐ స్కాంలో ఏ14తో సంబంధం ఉన్నది గనుక.. మంత్రి జయరాంకు ఆ స్కాంలో పాత్ర ఉన్నదని, దాన్ని కప్పిపుచ్చడానికే.. అచ్చెన్నాయుడు మీద ఆరోపణలు చేసి, అరెస్టు చేశారని తెదేపా అంటోంది. ఇది పూర్తి స్థాయిలో నిజం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే-
విచారణ ప్రకారం స్కాం తెదేపా హయంలో జరిగింది. అందులో కార్తీక్ కు భాగంఉంటే, ఇప్పుడు వైసీపీ హయాం వచ్చాక ఈ మంత్రికి కారు కానుక ఎందుకిస్తారు? విచారణ అప్పటి స్కాం మీద అయినప్పుడు, ఇప్పుడు మంత్రి అయిన వ్యక్తికి పాత్ర ఎలా ఉంటుంది? .. ఇవీ తెదేపా ఆరోపణల్లో పూరించబడని ఖాళీలు.
పైగా ఈఎస్ఐ స్కాంలో తుదిచెల్లింపులు వైఎస్సార్ కాంగ్రెస్ పాలన మొదలయ్యాకే జరిగాయి. ఆ చెల్లింపులకు కానుకగానే కార్తీక్ బెంజ్ కారు ఇచ్చాడనేది తెలుగుదేశం ఆరోపణ. అలా జరిగి ఉండడానికి పూర్తి అవకాశం ఉంది. ఆ రకంగా ఈఎస్ఐ స్కాంలో జయరాం పాత్రను కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
ఏం జరిగి ఉండొచ్చు..
సాధారణంగా ప్రభుత్వాఫీసుల్లో పైరవీలు చేసే కాంట్రాక్టర్లు ముఠాలుగా ఉంటారు. వాళ్లు డిపార్టుమెంటుల్ని పంచుకుని దందాలు చేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వాలు, పార్టీలు మారినప్పుడు.. సరఫరాదార్ల కంపెనీ లెటర్ హెడ్ లు మారుతాయి తప్ప.. దందాలు చేసే ముఠాలు మాత్రం సేమ్ టు సేమ్ ఉంటాయి.
బహుశా.. కార్తీక్ అలాంటి దళారీ ముఠాలో ఒక కీలక వ్యక్తి. తాను కూడా ఒక ఈఎస్ఐ కాంట్రాక్టరు. ప్రభుత్వంలో ఎవరున్నా కానుకలు సమర్పించి పనులు జరిపించుకోవడం తనకు అలవాటు. పాత ప్రభుత్వంలో అలాంటి దందాలే నడిపించి ఉంటాడు. కొత్త ప్రభుత్వం వచ్చాక కొత్త మంత్రికి కూడా కానుకలు బెంజి కారు రూపంలో సమర్పించుకున్నాడు. కొత్త ప్రభుత్వంలో కూడా తన దందాలు హాయిగా చేసుకోవచ్చునని అనుకుని ఉంటాడు. కానీ.. పాత ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా ఆరోపణలు ఉన్న స్కాంలో తన పేరు వస్తుందని ఊహించి ఉండడు. అలా ఏ14 గా పేరు రాకపోయి ఉంటే.. ఈశ్వర్ మరియు జయరాం ప్రాపకంతో బోలెడు కొత్త దందాలు జరుగుతూ ఉండేవి. ఈపాటికి కొన్ని మొదలై ఉండచ్చు కూడా.

జగన్ ఏం చేస్తారో..
‘బెంజి కారు కానుక’ బయటకు వచ్చిన తర్వాత.. సదరు కాంట్రాక్టరు కార్తీక్ తో మంత్రి జయరాం లాలూచీ పడిన మాట వాస్తవం. అయితే ఈ ఒక్క కారణంతో.. గత ప్రభుత్వంలో జరిగిన ఈఎస్ఐ స్కాంతో అచ్చెన్నాయుడుకు సంబంధం లేదని, ఇప్పటి మంత్రి జయరాంకు సంబంధం ఉన్నదని అనడం హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ స్కాం వేరు.. ఈ బెంజి కారు లంచం వేరు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదని చాటుకోవడానికి చాలా తాపత్రయ పడుతున్నారు. ఆయన మీద సుమారు దశాబ్దంగా ఉన్న అవినీతి ఆరోపణలను ప్రజలు మర్చిపోవాలంటే.. ఈ ప్రభుత్వం అవినీతిని సహించదనే నమ్మకం ఆయన కలిగించాలి. ఆయన తపన కూడా అదే. ఇప్పుడు జయరాం బెంజి బాగోతం స్పష్టంగా బయటకు వచ్చింది. మరి జగన్ ఏం చేస్తారు? జయరాం ను మంత్రి వర్గంనుంచి బర్తరఫ్ చేస్తారా? ఏసీబీ లేదా సీబీఐ విచారణకు ఆదేశిస్తారా? ముందు పదవినుంచి తప్పించి, విచారణ పూర్తయ్యేదాకా పదవి లేకుండా ఖాళీగా ఉంచి, ఆయన నిప్పు అని తేలితే తర్వాత పదవి అప్పగించి పారదర్శకత ప్రదర్శిస్తారా? ఇవన్నీ ప్రజల మదిలో మెదలుతున్న ప్రశ్నలు.
జగన్ ప్రభుత్వానికి లిట్మస్ టెస్ట్ ఇది. ప్రజలు కూడా అన్నీ గమనిస్తూ ఉంటారు.
.. సురేష్ పిళ్లె











