కరోనా కారణంగా గత తొమ్మిది నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో మూసివేసిన సినిమా థియేటర్లు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీచేసింది. ఇందులో ఎప్పట్నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అనే అంశాన్ని ప్రభుత్వం చెప్పకుండానే…థియేటర్ల యజమానుల వీలును బట్టి ఏ తేదీ నుంచైనా థియేటర్లు తెరుచుకోవచ్చునని ఆ జీవోలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ కోవిడ్ నిబంధనలు అనుసరించి 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లను నడపాలని, మాస్క్, శానిటైజర్ వంటి అన్ని జాగ్రత్తలు ప్రేక్షకులు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వులో వెల్లడించారు.
కరోనా సెకండ్ వేవ్ మొదలైనందున థియేటర్ యాజమాన్యాలు మరింత అప్రమత్తంగా ఉండాలని వివరించారు. దేశవ్యాప్తంగా అన్ లాక్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ;చాలా రోజుల క్రితమే థియేటర్లను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తెరచుకోవచ్చునని అనుమతులు ఇస్తూ, ఈ విషయంలో అక్కడి పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలన్న స్వేచ్ఛనిచ్చింది. ఆ మేరకు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలలో థియేటర్లు తెరుచుకున్నాయి.
అయితే తెలంగాణలో థియేటర్లు ప్రారంభించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ఎగ్జిబిటర్లతో పాటు నిర్మాతలు ఎదురుచూస్తూ వచ్చారు. అసలు థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా ? అన్న అంశంపై గత కొద్దిరోజులుగా ఊహాగానాలు వెల్లువెత్తాయి. తెలుగు సినిమాలు విడుదల చేయాలంటే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోని థియేటర్లలో ఒకేసారి విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకుంటే నిర్మాతకు తన పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం లేదు. అందుకే తెలంగాణ థియేటర్ల ఓపెన్ కోసం ఎదురుచూస్తూ వచ్చిన చిత్ర పరిశ్రమకు అనుమతులు లభించడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- సీఎం కేసీఆర్ హామీతో సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహం