గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు నగరంలో హై డ్రామా చోటు చేసుకుంది. వరద సాయం ఆపాలంటూ బీజేపీ ఎన్నికల సంఘానికి లేఖ రాసిందని టీఆర్ఎస్ చేసిన ప్రచారం తిప్పికొట్టేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసింది. లేఖపై నిజాలు తేల్చుకునేందుకు భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేసేందుకు ముఖ్యమంత్రి రావాలంటూ సవాల్ విసిరారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మధ్యాహ్నం 12 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి సంజయ్ చేరుకున్నారు. టీఆర్ఎస్ నేతలు బండి సవాల్ను తేలిగ్గా తీసుకున్నారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. అనవసరమైన సబ్జెక్ట్లపై సవాళ్ళ కంటే హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ అధికార పార్టీ నేతలు సవాల్ విసిరారు.
రాత్రి నుండే కనిపించ కుండా పోయిన సంజయ్ ..
సవాల్ విసిరిన తరువాత బండి సంజయ్ టికెట్ కేటాయింపులపై సమావేశానికి హాజరయ్యారు. మధ్య రాత్రి నాలుగో లిస్ట్ విడుదల అయిన తరువాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. బండిని ట్రేస్ చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఉదయం వరకు కూడా ఆయన కోసం పోలీసులు వెతికినా జాడ దొరకలేదు. మరోవైపు బీజేపీ నేతలు , కార్యకర్తలు నాంపల్లి రాష్ట్ర కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ వేసుకున్నారు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు నగరంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతులు లేవంటూ.. ఎవరైనా ర్యాలీలు నిర్వహిస్తే అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. సంజయ్ని బలవంతంగా అదుపులోకి తీసుకుంటే తలనొప్పులు తప్పవని భావించి .. ఆలయానికి ఎవరైనా వెళ్ళవచ్చంటూ హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
భాగ్యలక్ష్మి ఆలయానికి భారీగా చేరుకున్న బీజేపీ శ్రేణులు
పోలీసుల ఆంక్షలు లేక పోవడంతో బీజేపీ శ్రేణులు భారీగా ఆలయానికి చేరుకున్నారు. 12 గంటలకు బండి సంజయ్ ఆలయం వద్దకు వచ్చారు. కేసీఆర్ తన సవాల్కు సమాధానం చెప్పలేక బయటకు రాలేక పోయారంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ తన పేరుపై లేఖను సృష్టించి, తమపై అసత్య ప్రచారం చేస్తోందని.. పోర్జరీ లేఖతో తనను బ్లేమ్ చేయాలని చూస్తే ఎవరూ నమ్మరంటూ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందన్న భయంతోనే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని.. ఇప్పటికైనా ప్రజలకు చేసిన మంచి పనుల గురించి చెప్పుకుని ప్రచారం చేయాలని లేదంటే దుబ్బాక ఫలితాలే గ్రేటర్లో కూడా రిపీట్ అవుతాయంటూ హెచ్చరించారు బండి సంజయ్.