తీవ్ర వర్షాభావం, అడుగంటిన భూగర్భ జలాలు, ఫ్లోరైడ్ సమస్యలతో దశాబ్దాలుగా అల్లాడుతున్న ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల 30 ఏళ్ల కల నేటితో సాకారం కానుంది. మార్కాపురం జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ జలసవ్వడికి వేళయింది. అయితే ఈ ఘట్టంలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే..30 ఏళ్ల క్రితం 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నారా చంద్రబాబు నాయుడే, ఇప్పుడు స్వయంగా తన చేతుల మీదుగా దీనిని ప్రారంభించడం. దశాబ్దాల పాటు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్న ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రారంభించి కృష్ణా జలాలను విడుదల చేస్తుండటం ఇప్పుడు చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుంది.
ఫస్ట్ ఫేజ్ ప్రారంభంతో ఆయా కరవు ప్రభావిత ప్రాంతాలకు కొత్త జీవం రానుంది. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా 10.70 TMCల కృష్ణా జలాలను సొరంగం గుండా తరలించి నల్లమలసాగర్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి ప్రధాన కాలువల ద్వారా ఈ మొదటి విడతలో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల జనాభాకు తాగునీరు అందిస్తారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే..మూడు జిల్లాల్లోని 30 మండలాల పరిధిలో ఉన్న ఏకంగా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందుబాటులోకి వస్తుంది. దీనిద్వారా ఆ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ రక్కసికి శాశ్వత చెక్ పడటమే కాకుండా, వ్యవసాయం పండుగలా మారనుంది.
మూడు దశాబ్దాల ప్రయాణంలో వెలిగొండ ప్రాజెక్టుకు ఎన్నో సాంకేతిక, ఆర్థిక, నిర్మాణపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనుల్లో వేగం పెంచింది. టన్నెల్ పనులు, ఫీడర్ కాలువలు, హెడ్ రెగ్యులేటర్ల నిర్మాణాలను పరుగులు పెట్టించడమే కాకుండా..నిర్వాసిత కుటుంబాల పరిహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. 48 రోజుల రికార్డు వ్యవధిలోనే నిర్వాసితులకు రూ.768 కోట్లు చెల్లించి అడ్డంకులన్నీ తొలిగించింది. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు ఆదివారం సొరంగం నుంచి నీటిని విడుదల చేస్తూ నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో, కృష్ణమ్మను చూసిన స్థానికులు హర్షతిరేకాలు వ్యక్తం చేస్తూ వాట్సప్ స్టేటస్ లు పెట్టుకుని సంబరాలు చేసుకున్నారు.
వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించింది… ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లికి చేరుకున్నారు… ప్రత్యేక పూజలు నిర్వహించి, పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నల్లమల సాగర్కు కృష్ణా జలాలను విడుదల చేశారు. కరువు సీమలో జల వసంతం వెల్లివెరిసింది.. మూడు జిల్లాల ప్రజలు వెలిగొండ వెలుగులతో పండగ చేసుకుంటున్నారు..











