రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు, భారీ పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ..తన సొంత నియోజకవర్గం మంగళగిరి అభివృద్ధిపై నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. నియోజకవర్గ దశాదిశ మార్చే దిశగా నిరంతరం అడుగులు వేస్తున్న ఆయన, తాజాగా స్థానిక ప్రజలు, రైతులకు మరో అద్భుతమైన కానుకను అందించారు. మంగళగిరి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోనే మరెక్కడా లేని విధంగా అత్యాధునిక హంగులతో మోడల్ రైతుబజార్ నిర్మాణానికి లోకేశ్ శ్రీకారం చుట్టారు.
రైతులు తమ ఉత్పత్తులను దళారుల బెడద లేకుండా నేరుగా అమ్ముకునేందుకు, అలాగే వినియోగదారులు నాణ్యమైన కూరగాయలు కొనుగోలు చేసేందుకు వీలుగా మంగళగిరిలోని నిడమర్రు రోడ్డులో ఈ మోడల్ రైతుబజార్ను నిర్మిస్తున్నారు. అరబిందో ఫార్మా CSR నిధులు రూ.18.55 కోట్లతో, 5.90 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టుకు గురువారం ఉదయం మంత్రి లోకేశ్ భూమిపూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ నమూనాలను నిశితంగా పరిశీలించారు. పనుల్లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత గడువులోగా ఈ మార్కెట్ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దాదాపు 71,925 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ మోడల్ రైతుబజార్లో అద్భుతమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో కూరగాయల విక్రయానికి 102, పండ్లు మరియు పూల కోసం 54, ఇతర వస్తువుల విక్రయానికి 60 దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే హోల్సేల్ మార్కెట్లో రైతులు సరకు దించుకోవడానికి 18 ప్లాట్ఫాంలతో పాటు హోల్సేల్ విక్రయాల కోసం మరో 23 దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. రైతులు తీసుకువచ్చే కూరగాయలు పాడవకుండా ఉండేందుకు కోల్డ్ స్టోరేజ్, అలాగే ప్రత్యేక వెజిటబుల్ వాష్ ఏరియాను ఏర్పాటు చేస్తున్నారు.
వ్యాపారులు, కొనుగోలుదారుల సౌకర్యార్థం అడ్మిన్, మెయింటెనెన్స్ బ్లాకులతో పాటు క్యాంటీన్, మరుగుదొడ్ల సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సరకులు రవాణా చేసే భారీ వాహనాలకు, కస్టమర్ల ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూనే, మంగళగిరిని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు లోకేశ్ తీసుకుంటున్న చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.











