ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా..ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి వెళ్లి మేం చేసేది ఏం ఉంటుంది. గతంలో ఈ మాటలు చెప్పిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్..ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. మాట తప్పం, మడమ తిప్పం అంటూ ఎప్పుడూ చెప్పే జగన్ ఇప్పుడు మడమ తిప్పారు. అనర్హత వేటు పడుతుందన్న భయమో లేక మరేదైనా కారణమో తెలియదు గానీ…ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. తన ఎమ్మెల్యేలతో ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఐతే అసెంబ్లీకి వెళ్లకపోతే తనపైనా, తన ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ అనర్హత వేటు పడి ఉపఎన్నికలు వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ కౌంట్ 11 నుంచి జీరోకు పడిపోయే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 11 స్థానాల్లో మెజార్టీ సీట్లు స్వల్ప తేడాతో గెలిచినవే. ఎర్రగొండపాలెంలో 5 వేల ఓట్లు, దర్శిలో 2 వేల ఓట్లు, బద్వేలులో 15 వేలు, రాజంపేటలో 7 వేలు, మంత్రాలయంలో 10 వేలు, ఆలూరులో 2 వేల ఓట్లు, తంబళ్లపల్లెలో 10 వేలు, పుంగనూరులో 7 వేల ఓట్ల తేడాతో మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. రెండు గిరిజన నియోజకవర్గాలు అరకు, పాడేరుల్లో మాత్రం పాతికవేలకుపైగా మెజార్టీ వచ్చింది. ఇక జగన్ సొంత నియోజకవర్గంలోనూ గతం కంటే మెజార్టీ తగ్గింది.
అధికారంలో లేకపోతే ఉపఎన్నికల్లో గెలవడం ఎంత కష్టమో జగన్కు తెలియనిది కాదు. 2017లో జరిగిన నంద్యాల బై ఎలక్షన్ వైసీపీకి పాఠం నేర్పింది. 2014లో భూమా నాగిరెడ్డి వైసీపీ టికెట్పై గెలిచి తర్వాత టీడీపీలో చేరారు. చేరిన కొన్ని రోజులకే గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాలకు ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఒక రకంగా వైసీపీకి నంద్యాల అప్పుడు సిట్టింగ్ సీటు. దీంతో సిట్టింగ్ సీటును తిరిగి గెలుచుకునేందుకు జగన్ తీవ్రంగా శ్రమించారు. అక్కడే తిష్ట వేసి 10 రోజుల పాటు వీధి వీధి తిరిగారు. ఐనప్పటికీ 25 వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించారు.
జగన్ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడే అవకాశాలున్నాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ RRR ఇప్పటికే పలు సందర్భాల్లో హెచ్చరించారు. దీంతో జగన్లో భయం మొదలైంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఉపఎన్నికలు వస్తే కంచుకోట పులివెందులను కాపాడుకోవడం కూడా జగన్కు కష్టమే. పులివెందులలోనూ పార్టీ కేడర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. చాలా వరకు అప్పులపాలయ్యారు. ఉపఎన్నికలు వస్తే జగన్ కు వారు హ్యాండివ్వడానికి రెడీగా ఉన్నారని గ్రౌండ్ పరిస్థితులు చూసిన వారికి ఎవరికైనా అర్థం అవుతుంది. పరిస్థితి అర్థం చేసుకున్నారు కాబట్టే అసెంబ్లీకి రానంటూ ప్రకటనలు చేసిన జగన్ ఇప్పుడు మడమ తిప్పి..అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.











