ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన పార్టీని పూర్తిస్థాయిలో జగన్ ప్రక్షాళన చేస్తున్నారు. తాను చేయించిన సర్వేలనే బాగా నమ్ముతూ ఆ రిపోర్టుల ఆధారంగానే అనేక మార్పులు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇది ఒక రకంగా రిస్క్ వ్యవహారమే.. అయినా జగన్ ఎక్కడా తగ్గకుండా మొండిగా ముందుకు వెళ్తున్నారు. దీనివల్ల జరిగే నష్టాన్ని ఆయన అంచనా వేయడం లేదు.. అయితే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అటు రాయలసీమలో ఎక్కువ స్థానాలు గతంలో కంచుకోటగా ఉన్నాయి కాబట్టి.. ఆ తర్వాత ఉత్తరాంధ్రను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటే మ్యాజిక్ ఫిగర్ చేరుకొని గెలవవచ్చనే యోచనలో ఉన్నారు.
కానీ, బుధవారం జరిగిన యువగళం నవశకం సభతో జగన్ కు ఉత్తరాంధ్రపై ఆశలు మొత్తం పోయాయి. విజయనగరం జిల్లాలో జరిగిన ఆ సభకు వచ్చిన జనం, టీడీపీ, జనసేన అగ్ర నాయకులపై జనం చూపించిన ఆదరాభిమానాలు చూసి వైసీపీ అధిష్ఠానానికి మైండ్ బ్లాంక్ అయింది. తాము ఉత్తరాంధ్రపై ఎన్నో ఆశలు పెట్టుకొని, అక్కడి ప్రజలకు ఆశలు కల్పిస్తే ఇలా తిరగబెట్టిందేంటని ఆశ్చర్యపోతున్నారు.
రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చడం, భోగాపురం ఎయిర్ పోర్టు, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పెద్ద హాస్పిటల్ నిర్మాణం, లాంటి ముఖ్యమైన కార్యక్రమాలను వైసీపీ చేపడుతోంది. వాటిలో ఒక్క ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ తప్ప మిగిలిన పనులు అయ్యేవి కావు. కానీ, ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆశలు రేకెత్తించి.. వారు తమవైపు ఉండేలా వ్యూహం అమలు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి రాజధాని మార్పు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చలు జరుగుతున్న వేళ.. అసలు విశాఖపట్నంలో జనాలు రాజధానిని కోరుకోని వాతావరణం నెలకొంది. ఎందుకంటే టీడీపీకి చెందిన పలువురు నేతలు.. అసలు విశాఖలో 90 శాతం ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదని తేల్చి చెబుతున్నారు. ప్రజాభిప్రాయసేకరణ చేస్తే అసలు నిజాలు బయటపడతాయని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో అన్నారు.
అయితే, అటు ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ బలంగా ఉండటం.. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఉన్న పట్టు పోతుండడంతో.. ఉత్తరాంధ్ర పైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. అందుకు అనుగుణంగా తాము చెబుతున్న రాజధాని మార్పు, భోగాపురం ఎయిర్ పోర్టు లాంటివి తమను అక్కడ గట్టెక్కిస్తాయని అనుకుంది. కానీ, అసలు విశాఖ వాసుల్లో రాజధాని సెంటిమెంటే లేదని ఎప్పుడో అర్థమైపోయింది. తాజాగా యువగళం నవశకం సభ జరిగిన తీరుతో అసలక్కడ వైసీపీ సత్తా చాటడానికి ఏ మాత్రం అవకాశం లేని పరిస్థితి ఉందని జగన్ కే అర్థమైపోయింది.