ఐపీఎల్-13 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ టోర్నీని సొంతం చేసుకోని బెంగళూరు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు క్రీడా వర్గాలలో చర్చ జరుగుతోంది. టోర్నీకి ప్రారంభం ముందే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పిన జోస్యాన్ని నిజం చేసేలా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రదర్శన చేస్తోంది. నిన్నటి వరకు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లో లేకపోవడం ఆ జట్టును ఇబ్బందులకు గురి చేసింది. తాజాగా రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ తిరిగి ఫామ్ లోకి రావడంతో ఆ జట్టు కష్టాలు తీరిపోయాయి. ఓపెనింగ్ స్లాట్ లో ఆరోన్ ఫించ్ తో కలిసి బ్యాటింగ్ కు దిగుతున్న దేవదత్ పడిక్కాల్ సత్తా చాటుతుండటం బెంగళూరు జట్టుకు అదనపు ప్లస్ గా నిలిచింది.
బ్యాటింగ్ విభాగంలో బెంగళూరు సత్తా
దేశవాళీ సీజన్ లో అద్భుతంగా రాణించడంతో కర్ణాటకకు చెందిన దేవదత్ పడిక్కాల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. రెగ్యులర్ ఓపెనర్ లేకపోవడంతో ఇన్నాళ్లు పార్థివ్ పటేల్ ఓపెనర్ గా వచ్చే సంగతి తెలిసిందే. పార్థివ్ పటేల్ విఫలం కావడంతో మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పెరిగేది. కానీ దేవదత్ రాకతో ఓపెనింగ్ స్లాట్ బలంగా తయారయింది. నాలుగు మ్యాచులు ఆడిన దేవదత్ మూడు అర్ద సెంచరీలతో తన సత్తా చాటాడు. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ కూడా మంచి ఫామ్ లో ఉండటం బెంగళూరు జట్టుకు అదనపు బలాన్ని ఇస్తోంది. ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ, సెకండ్ డౌన్ లో ఏబీ డివిలియర్స్, ఆ తరువాత ఆల్ రౌండర్ కోటాలో శివమ్ దూబే, గురుకీరత్ సింగ్ ఉండటంతో బెంగళూరు జట్టు బలంగా ఉంది.
రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో దేవదత్ పడిక్కాల్, విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ లు ఆడి హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరి కారణంగా ఈ మ్యాచ్ లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.
బౌలింగ్ విభాగం
శ్రీలంకకు చెందిన ఉదాన, నవదీప్ షైనీ అంచనాల మేరకు రాణిస్తుండటం బెంగళూరు జట్టుకు ఊరట లభించింది.లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉదాన స్వింగ్, షైనీ వేగానికి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇక చేజ్ బౌలర్లగా వస్తున్న యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ మిడిల్ ఓవర్లలలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జాంపా జట్టులో ఉండటం బెంగళూరుకు కలిసి వస్తోంది. ఈ బౌలర్లలలో ఎవరూ విఫలమైనా శివమ్ దూబే ఉండటంతో కోహ్లీకి బౌలింగ్ మార్పులు చేసే అవకాశం చిక్కింది. ఉమేష్ యాదవ్, మొయిన్ అలీ, మహమ్మద్ సిరాజ్ లు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తుండటం బెంగళూరు జట్టుకు మంచి అవకాశమని క్రీడా వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. వాషింగ్టన్ సుందర్ తన కోటాలో వికెట్ తీయకపోయినా కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి రాజస్తాన్ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచారు. ఆ తరువాత చాహల్ 4 ఓవర్లలలో 24 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసి రాజస్తాన్ ను తక్కువ స్కోరుకు కట్టడి చేశారు. దీంతో చాహల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఇదే సత్తా చాటితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ ను విజేతగా నిలిచినా ఆశ్చర్యపడవలిసిన అవసరం లేదు.











