కరోనా తర్వాత మళ్లీ ఒక్కొకరుగా షూటింగుల బాట పడుతున్నారు. షూటింగులు లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోవడానికి మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. కోవిడ్ నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ సెట్స్ లో సందడి చేస్తున్నారు. ఈ విషయంలో అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ లీడ్ తీసుకోగా.. సాయిధరమ్ వంటి మెగా హీరోలు దాన్ని ఫాలో అయ్యారు. అయితే ఇప్పటివరకూ సీనియర్స్, జూనియర్స్ మాత్రమే షూటింగులలో పాల్గొనగా ఇప్పుడు స్టార్స్ వంతొచ్చింది.
ఆరు నెలల గ్యాప్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ షూటింగును షురూ చేయడానికి సిద్ధమయ్యాడు. ‘రాధేశ్యామ్’ కోసం ఇటీవల ఇటలీ బాట పట్టాడు యంగ్ రెబెల్ స్టార్. ఇప్పుడు ప్రభాస్ బాటలోనే బన్నీ కూడా ‘పుష్ప’ని తిరిగి పట్టాలెక్కించబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘పుష్ప’ చిత్రం లాక్ డౌన్ కి ముందే కొంతభాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇక బన్నీతో సీన్స్ తెరకెక్కిద్దాము అనుకునే సమయంలో కరోనా బ్రేక్ వచ్చింది.
వైవిధ్యభరిత కథాంశాలతో సినిమాలు తీసే సుకుమార్ ‘పుష్ప’ చిత్రానికి ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కోసం అడవుల్లో ఎలాంటి సాహసాలు జరుగుతాయో ఈ సినిమాలో మనకు కళ్లకు కట్టినట్టు చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట ఈ క్రియేటివ్ జీనియస్. ఈ మూవీలో బన్నీ ఎర్రచందనం స్మగ్ల్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో రశ్మిక కథానాయిక. ఈ కన్నడ కస్తూరి ‘పుష్ప’ కోసమే చిత్తూరు మాండలికం ప్రాక్టీస్ చేసిందట. విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తాడనే ప్రచారం సాగింది. అయితే డేట్స్ సర్దుబాటు చేయలేక విజయ్ తప్పుకోవడంతో ఆ రోల్ ని మాధవన్ చేయబోతున్నాడనేది లేటెస్ట్ టాక్.
ఈనెలలోనే ‘పుష్ప’ తిరిగి పట్టాలెక్కబోతుంది. కేరళ అడవుల్లో బన్నీపై ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించబోతున్నాడట సుకుమార్. ఇంతకుముందు ఆన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడనటువంటి జంగిల్ ఫైట్ సీక్వెన్స్ ను పీటర్ హెయిన్స్ కొరియోగ్రాఫ్ చేయనున్నాడట. పాన్ ఇండియా స్థాయిలో పలు భాషలను టార్గెట్ చేస్తూ రూపొందుతున్న ఈ సినిమాలో ఆ భారీ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ అవుతుందని భావిస్తుందట చిత్రబృందం.
ఇప్పటికే ‘పుష్ప’ షూటింగ్ బాగా ఆలస్యమవ్వడంతో సింగిల్ షెడ్యూల్ లోనే సినిమా మొత్తాన్ని పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. అందుకోసం లాక్ డౌన్ లో ప్రణాళిక కూడా సిద్ధం చేశాడట. ఆద్యంతం అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాకోసం బన్నీ ఫైట్ సీక్వెన్స్.. ఆ తర్వాత రశ్మిక కాంబోలో కొన్ని లవ్ సీన్స్ ను తెరకెక్కించే ప్లాన్ చేశాడట. అలా కంటిన్యూగా సింగిల్ షెడ్యూల్ లోనే సినిమా మొత్తాన్ని పూర్తిచేసి వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాడట సుకుమార్. ‘పుష్ప’ తర్వాత సుకుమార్ ఇప్పటికే విజయ్ దేవరకొండతో సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు. మొత్తంమీద ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత బన్నీ-సుక్కూ కాంబోలో రాబోతున్న ‘పుష్ప’ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.