కరోనా కారణంగా థియేటర్లు మూతపడడం.. డిసెంబర్ నుంచి థియేటర్లు ఓపెన్ చేయడం తెలిసిందే. అయితే.. జనాలు సినిమా చూడడానికి థియేటర్లకి వస్తారో రారో అనుకుని సంక్రాంతికి ప్లాన్ చేసిన కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే.. సోలో బ్రతుకే సో బెటరు మూవీకి అనూహ్యమైన స్పందన రావడంతో సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడానికి పోటీపడ్డారు. మాస్ మహారాజా రవితేజ క్రాక్ మూవీని జనవరి 14న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఆతర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన రెడ్ మూవీని కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేశారు. దీంతో సంక్రాంతికి రవితేజ, రామ్ మధ్య పోటీ ఏర్పడడంతో… ఈ పోటీలో ఎవరు బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా పోటీపడడం మంచిది కాదని ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశారని తెలిసింది.
రవితేజ క్రాక్ మూవీని జనవరి 9న, విజయ్ మాస్టర్ మూవీని 13న, రామ్ రెడ్ మూవీని 14న, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అల్లుడు అదుర్స్ మూవీని జనవరి 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారని తెలిసింది. రవితేజ సినిమాకి, విజయ్ సినిమాకి మధ్య నాలుగు రోజుల గ్యాప్ ఉంది. మిగతా మూడు సినిమాల మధ్య ఒక్కోరోజు గ్యాప్ ఉంది. ఈ సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలన్నీ మాస్ సినిమాలే కావడం విశేషం.











