వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమరరాజా బ్యాటరీస్ సంస్థ AP నుంచి తరిమేశారన్న విమర్శలపై స్పందించారు. అదంతా అబద్ధమని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. గల్లా కుటుంబంతో మంచి సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు మిథున్ రెడ్డి.
అమర్రాజా బ్యాటరీస్ను తరిమేశారా అని టీవీ9 రజినీకాంత్ అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వలేదు మిథున్ రెడ్డి. గల్లా జయదేవ్ తనకు అత్యంత ఆప్త మిత్రుడని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలు వేరైనా, వ్యక్తిగతంగా తాము ఎంతో సన్నిహితంగా ఉంటామని వెల్లడించారు. తాను ఎంపీగా గెలిచిన సమయంలో, అందరికంటే ముందుగా గల్లా అరుణకుమారి గారే తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని ఆయన గుర్తు చేసుకున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో కాలుష్య నియంత్రణ మండలి – PCB నిబంధనల పేరుతో అమరరాజా సంస్థకు నోటీసులు రావడం, ఆ తర్వాత ఆ సంస్థ తన భారీ విస్తరణ ప్రాజెక్టును తెలంగాణకు తరలించడం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గల్లా కుటుంబాన్ని వేధించి, పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టిందని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది.
జగన్ ప్రభుత్వంలో ఎదురైన పరిణామాల తర్వాత, అమరరాజా గ్రూప్ తన దృష్టిని తెలంగాణ వైపు మళ్లించింది. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో దాదాపు ₹9,500 కోట్ల భారీ పెట్టుబడితో లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుంది. ఏపీకి రావాల్సిన పెద్ద ప్రాజెక్టు పొరుగు రాష్ట్రానికి తరలిపోవడంపై ఇప్పటికీ రాజకీయంగా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.











