తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ఘటన జరిగాక మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు.రుయాలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి వెల్లడించారు.గత ఏడాది కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఏపీలో 250 టన్నుల ఆక్సిజన్ మాత్రమే అవసరం అయిందని,ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏపీకి 590 టన్నులు కేటాయించినా చాలడం లేదని ఆయన గుర్తు చేశారు.ఆక్సిజన్ అవసరాలు వేగంగా పెరిగిపోతున్నాయన్నారు. ప్రస్తుతం ఏపీలో 25వేల మందికి ఆక్సిజన్తో చికిత్స అందిస్తున్నట్టు ఆయన తెలిపారు.
లోపాలు లేకుండా చర్యలు
ఏపీలో ఆక్సిజన్ సరఫరాలో లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించేందుకు ముగ్గురు సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టు ఆయన వెల్లడించారు.ఆక్సిజన్ నిల్వల విషయంలోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. ఆక్సిజన్ సరఫరా 910 టన్నులకు పెంచాలని సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాసినట్టు మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీలో 517 టన్నుల ఆక్సిజన్ నిల్వలకు మాత్రమే సదుపాయాలు ఉన్నాయని,600 టన్నులకు పెంచే కార్యక్రమం చేస్తున్నట్టు మంత్రి ఆళ్ల నాని మీడియాకు వెల్లడించారు.