తన కాన్వాయ్పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి . వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుల ముందస్తు ప్లాన్ ప్రకారమే పశర్లపాడు దగ్గర దా*డి జరిగిందని ఆయన ఆరోపించారు. మంగళవారం వెల్దుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, మద్యం సీసాలతో దాడులు చేయడం చేతగానితనాన్ని సూచిస్తుందని, ఇలాంటి చీకటి రాజకీయాలు పిన్నెల్లి సోదరులకు అలవాటేనని మండిపడ్డారు.
ప్రజలు తిరస్కరించినా పిన్నెల్లి సోదరుల్లో మార్పు రాలేదన్నారు జూలకంటి . శాసనసభ్యుడిపై ఆకతాయిలు దా*డి చేయడం సాధ్యం కాదని, ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్ర అని స్పష్టం చేశారు. పిన్నెల్లి మాటలు నమ్మి వైసీపీ కార్యకర్తలు తమ జీవితాలను పణంగా పెట్టవద్దని, వారి నీచ రాజకీయాలకు బలవ్వద్దని ఈ సందర్భంగా హితవు పలికారు.
తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఎందరో గుంటనక్కలను చూశానని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడే ప్రసక్తే లేదని బ్రహ్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాచర్ల టీడీపీ బాధ్యతలు తీసుకున్నప్పుడే ప్రాణాలకు తెగించి వచ్చానని పేర్కొన్న ఆయన, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. గతంలో ఎమ్మెల్యేగా పిన్నెల్లి చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని, వారు చేసిన అరాచకాలు, అవినీతి చిట్టాను తాను బయటపెడతానని సవాల్ చేశారు.
పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతూ పిన్నెల్లి సోదరులు దోపిడీకి పాల్పడుతున్నారని జూలకంటి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాచర్ల నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అభివృద్ధిని అడ్డుకోవడానికే వైసీపీ నేతలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.











