(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
అమరావతి రాజధానిని మూడు ముక్కలు, వేల గుండెలను లక్షల ముక్కలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించి 300 రోజులైంది. ఏపీ మధ్యలో అన్ని జిల్లాల వారికి సమాన దూరంలో రాజధాని వచ్చిందని అందరూ పూర్తిగా సంతోషించే లోగానే.. ప్రాంతాల మధ్య ద్వేషాలు రగిలించే నిర్ణయం వచ్చింది. అమరావతి రైతులు తమ జీవనోపాధి కోల్పోతామని తెలిసినా 33 వేల ఎకరాల భూమిని భూ సమీకరణ ద్వారా ఇచ్చారు. ఈ విధానంలో ఇంత భూమి సమీకరించడం దేశంలో ఇదే మొదటి సారి. రైతులు రాజధానికి ఇచ్చిన భూమిలో నాలుగో వంతు అభివృద్ధి చేసిన భూమి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాజధానికి భూములిచ్చిన రైతులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. వారి బిడ్డల భవిష్యత్తుపై బెంగతో ఇప్పటికే 92 మంది రైతులు ప్రాణాలు విడిచారు.
‘అమరావతి’ని చంపేందుకు అనేక ప్రయత్నాలు
అమరావతి రాజధానిని చంపేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. ముందుగా మంత్రులు అమరావతి ముంపు ప్రాంతమని ప్రచారం చేశారు. అమరావతి ఒక సామాజికవర్గానికి చెందిన వారిదని మరోసారి విష ప్రచారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే ఏకంగా అమరావతి స్మశానంలా ఉందని జుగుప్సాకర కామెంట్లు చేశారు. ఇలా రైతులను రెచ్చగొడుతూ అమరావతి రాజధానికి పనికిరాదు అనే ముద్ర వేయాలని చూశారు. కానీ తుఫానులు, తీవ్ర కాలుష్య ముప్పును ఎదుర్కొంటోన్న విశాఖతో పోల్చుకుంటే అమరావతి ప్రాంతం రాజధానికి అనువైన ప్రాంతమని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రైతుల ఉద్యమం ఊరికే పోదు
300 రోజులుగా అమరావతి రాజధాని రైతులు, రైతు సంఘాలు చేస్తున్న ఉద్యమం సత్ఫలితాలను ఇస్తుందనే చెప్పవచ్చు. అమరావతి ఉద్యమం ప్రారంభం అయ్యాక 92 మంది రైతులు చనిపోయినా…ఎక్కడా అధైర్యపడకుండా ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపించడం చాలా గొప్పవిషయం. మూడు రాజధానుల ప్రకటన చేసిన సందర్భంలో పోలీసులు రాజదాని రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తించినా.. రైతులు ఎక్కడా శాంతియుత మార్గాన్ని వీడలేదు. రాజధాని గ్రామాల్లో వేలాది పోలీసులను మోహరించినా రైతులు సంయమనంతో వ్యవహరించారు. ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు నడిపించారు. ఇవన్నీ అమరావతి రైతులు సాధించిన విజయాలుగా చెప్పుకోవచ్చు.
కోర్టు తీర్పులే అమరావతి రైతులకు రక్ష
అమరావతి రాజధానిని తరలించాలనే ప్రయత్నాలు రైతులు సమర్ధంగా ప్రతిఘటించారు. హైకోర్టులో అనేక కేసులు వేశారు. గత ప్రభుత్వం, రాజధాని రైతులతో చేసుకున్న ఒప్పందాలను కూడా ఉల్లంఘించి చివరకు సీఆర్డీయేను కూడా రద్దు చేశారు. వీటిపై కూడా రైతులు న్యాయపోరాటానికి దిగారు. ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని మరో ప్రభుత్వం రాగానే కాలరాయడానికి వీల్లేదు. అయినా వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా సీఆర్డీయేను రద్దు చేసింది. దీనిపై కూడా హైకోర్టులో కేసు విచారణలో ఉంది. అమరావతి రాజధానిపై మొత్తం 92 కేసులు విచారణలో ఉన్నాయి. మరికొన్ని అనుబంధ వ్యాజ్యాలపై ధర్మాసనం రోజువారీ విచారణ చేపట్టింది. న్యాయవ్యవస్థపై నమ్మకంతో రాజధాని రైతులు ప్రభుత్వంతో చేస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోనుంది.
అమరావతి జేఏసీ ఉద్యమ కార్యాచరణ
రాజధాని ఉద్యమం 300 రోజులకు చేరిన సందర్బంగా అమరావతి జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. రాత్రి దీపాలు వెలిగించడం, రెవెన్యూ కార్యాలయాల వద్ద దర్నాలు, రాస్తారోకోలు చేయాలని నిర్ణయించారు. జేఏపీ నిర్ణయాలకు పలు పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబనాయుడు కూడా అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలు అమరావతి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీపాలు వెలిగించి అమరావతి రైతులకు సంఘాభావం తెలపాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.











