ఏపీ ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అయ్యారో ఏపీలో భూముల ధరలు పడుకుండిపోయాయి. చంద్రబాబు హాయంలో ఉవ్వెత్తున ఎగసిన రాజధాని అమరావతి ప్రాంత భూములు జగన్ రాగానే నేలచూపులు చూశాయి. ఇక జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడైతే భూముల ధరలు అమాంతం పడిపోయాయి. ఇక అప్పటి నుంచి అసలు భూములు కొనేవారే కరవయ్యారు. గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కానీ, తాజాగా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. రాజధాని ప్రాంత భూముల్లో కదలిక వస్తోంది.
అమరావతిలో కొన్నిరోజులుగా ప్లాట్ల ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కొత్త వ్యక్తులు వచ్చి ప్లాట్ల ధరలు, ఇతర అంశాలపై ఆరా తీస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. రాజధాని పరిధిలోని గ్రామాల్లో రెసిడెన్స్, కమర్షియల్ ప్లాట్ల ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. పెట్టుబడి దారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ప్రాంతాల్లో భూములు కొనేందుకు ఆసక్తి కనబరుస్తుండడంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అమరావతి రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. ఇంకో మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నందున వచ్చే ప్రభుత్వం ఏపీలో టీడీపీ, జనసేన ప్రభుత్వమే వస్తుందని అందరిలోనూ నమ్మకం ఉంది. అందుకే ఈ మార్పులు వస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే, అమరావతిలో డెవలప్ మెంట్ ను పరుగులు పెట్టిస్తారని అంతా నమ్ముతున్నారు.
నిజంగానే చంద్రబాబు హాయాంలో అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. అమరావతిలో కార్యాలయాలు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకొచ్చాయి. వారికి ప్రభుత్వం భూములు కూడా కేటాయించిందది. ఆ అమరావతి బృహత్ ప్రణాళికతో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లతో పాటు రాజధానిలో మౌలిక సదుపాయాల పనులు ప్రారంభం అయ్యాయి. దీంతో అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల కొనుగోలుకు అప్పట్లో బాగా డిమాండ్ ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పరిస్థితి మొత్తం తారుమారు అయింది. అమరావతికి అడుగడుగునా ఆటంకాలు ఏర్పడ్డాయి. తాజాగా డిసెంబరు ప్రారంభం నుంచి పరిస్థితులు ఆశాజనకంగా మారడంతో రైతులకు కొంత ఆనందం కనిపిస్తోంది.
పెరుగుతున్న భూముల ధరలు
మూడు నెలల క్రితం వరకూ కూడా ఆ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయాలనుకునే వారు ఆరా తీయడం కోసం సరాసరిన వారానికి ఒకరు వచ్చేవారు. ఇప్పుడు వారి తాకిడి పెరిగింది. ప్రస్తుతం ఆయా గ్రామాలకు రోజూ 10 మంది వరకు వచ్చి ధరల గురించి అడుగుతున్నారు. రెసిడెన్షియల్ ప్లాట్ల రేట్లు గతంలో కంటే గజానికి రూ.5 వేల దాకా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. అమ్మకాలు కూడా క్రమంగా ఊపందుకుంటున్నాయి. వాణిజ్య ప్లాట్ల ధర గజానికి రూ.10 వేల వరకు పెరిగి, సుమారు రూ.35 నుంచి 40 వేలు పలుకుతోందని అమరావతి రైతులు చెబుతున్నారు. రోజుల వ్యవధిలోనే ధరలు పెరగడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ధరలు అమాంతం పెరుగుతుండడం పట్ల కొనుగోలుదారులు కూడా ఎగబడుతున్నారు. భవిష్యత్తులో రేట్లు మరింత పెరుగుతాయేమో అని త్వరపడుతున్నారు.