అమెరికా అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ వీరాభిమాని గుండెపోటుతో మరణించాడు. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కృష్ణ.. అమెరికా అధ్యక్షుడికి వీరాభిమాని. అభిమాని అంటే అట్లాంటి.. ఇట్లాంటి అభిమాని కాదు. అదోరకమైన వీరాభిమాని. తనకు ట్రంప్ అంటే ఎంత అభిమానమంటే ఏకంగా ట్రంప్కు గుడినే కట్టి, ఆ గుడిలో ఆయన విగ్రహం పెట్టి.. నిత్యం పూజలు చేసేంత అభిమానం. అభిమానం ఉంటే మంచిదే కానీ ఇలా ప్రాణాలు ఇడిసేంత అభిమానం ఏమాత్రం పనికిరాదంటున్నారు. తన అభిమానం పట్ల కొందరు పెదవి విరుస్తుంటే మరికొందరు నిజమైన అభిమానంటే కృష్ణనే అని అంటున్నారు.
మనోవేదనతో…
కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ట్రంప్ అభిమాని కృష్ణ.. ట్రంప్పై రంది పెట్టుకున్నాడట. ఆ రోజు నుంచి కృష్ణ నిద్రాహారాలు మాని మనోవేదనతో కుమిలిపోయాడట. ట్రంప్కు కరోనా తగ్గాలని పూజలు కూడా చేసాడట. ట్రంప్ మాత్రం కరోనా నుంచి కోలుకున్నాడు గానీ అభిమాని కృష్ణ మాత్రం మనోవేదనతో కోలుకోలేకపోయాడు. నిత్యం ట్రంప్ నామమే జపం చేస్తూ చేస్తూ ప్రాణాలు వదిలేశాడు.
చిత్ర పటం నుంచి గుడివరకు..
ట్రంప్పై కృష్ణ చూపిస్తున్న అభిమానానికి మొదట్లో కొందరు అశ్చర్యం వ్యక్తం చేశారు. ట్రంప్కు మన దేశంలో.. అది కూడా తెలంగాణలోని ఓ గ్రామంలో ఇంతలా అభిమానించే అభిమాని ఉండడమేంటని ఆ గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారట. క్రమంగా కృష్ణ చూపించే అభిమానానికి వారు కూడా ఫిదా అయిపోయారట. ట్రంప్ వీరాభిమాని కృష్ణ 2017లో దీపావళి రోజు తన ఇంట్లో డోనాల్డ్ ట్రంప్ చిత్రపటానికి పూజలు చేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. అక్కడితో ఆగకుండా తన ఇంటి ప్రాంగణంలో ఏకంగా ట్రంప్కి గుడినే కట్టి అందులో ట్రంప్ విగ్రహాన్ని పెట్టి రోజూ పూజలు చేసి ప్రసాదాలు పెట్టేవాడట. ఇలా తన అభిమానాన్ని చూటుతూ ట్రంప్ దృష్టిని ఆకర్షించాడు. కృష్ణ గురించి ట్రంప్ అప్పట్లో ట్వీట్ కూడా చేశారు. క్రిష్ నా అభిమానంటూ ట్వీట్ చేశారు. వంద కోట్ల భారతీయుల్లో క్రిష్ నా స్నేహితుడు, తనను నేను త్వరలోనే కలుస్తా అని అప్పట్లో ట్రంప్ కామెంట్ చేయడం విశేషం.
అయితే తన వీరాబిమాని కృష్ణ మృతిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో..లేదో చూడాలి మరి.