వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం డిస్టిలరీల నుంచి వైసీపీ ముఠా వసూలు చేసి ఓ డెన్లో డబ్బాలలో దాచిన సొమ్ము చోరీకి గురైనట్లు తెలుస్తోంది. చోరీకి గురైన సొమ్ము విలువ దాదాపు రూ.5 కోట్ల 80 లక్షల ఉంటుందని సమాచారం. ఈ దోచేసిన సొమ్ముతో నిందితులు ఒడిశా, హైదరాబాద్లో స్థిరాస్తులు కొన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో ఆ ఆస్తులు జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి సిట్ ప్రతిపాదనలు పంపింది.
లిక్కర్ డిస్టిలరీల నుంచి వసూలు చేసిన లంచాల సొమ్మును A-1 రాజ్ కేసిరెడ్డి, A-9 టి.ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లోని పలు డెన్లలో అట్టపెట్టేల్లో దాచారు. ఈ కేసులో నిందితుడైన A- 41 సైమన్ ప్రసన్న బావమరిది A- 44 మోహన్ కొల్లిపురి ఇంట్లో కూడా ఓ డెన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కోట్ల రూపాయల నగదు దాచారు. మోహన్ అన్న అనిల్కుమార్కు విశాఖపట్నంలో కాలు విరగడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్కు తెచ్చుకుని తన ఇంట్లోనే ఉంచుకున్నారు. అనిల్కుమార్ను చూసేందుకు ఒడిశాలోని కటక్కు చెందిన అతని ప్రియురాలు రష్మిత బెహరా హైదరాబాద్లోని మోహన్ నివాసానికి వచ్చారు. కటక్లో ఆమె స్పాలు, సెలూన్లు నడిపిస్తుంటారు. మోహన్ ఇంట్లోకి రూ.కోట్లలో నగదు రావడం, దాన్ని జాగ్రత్తగా భద్రపరచడం గమనించిన ఆమె..ఇదంతా అక్రమ సొత్తేనని గుర్తించారు. ఆ డబ్బు కొట్టేసినా వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేరని భావించి ఆ డబ్బు కొట్టేయడానికి స్కెచ్ గీశారు. కటక్లో ఉండే తన మరో స్నేహితుడు ఈర్షద్ అహ్మద్కు ఫోన్ చేసి..మోహన్ నివాసంలో దాచిపెట్టిన మద్యం లంచాల సొమ్ము కాజేయడానికి ప్లాన్ వేశారు.
రష్మిత బెహరా సూచనల మేరకు 2023 జనవరిలో ఈర్షద్ అహ్మద్ కటక్ నుంచి హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్లోనే నివసించే తమ ప్రాంతవాసి ముబారక్ అలీని కలిశారు. మొత్తంగా ఆరుగురు సభ్యులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. 2023 జనవరి 13న మోహన్ ఇంటివద్ద రెక్కీ నిర్వహించారు. మర్నాడు తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రష్మిత బెహరా..మోహన్ ఇంటి తలుపులు తెరిచి ఉంచటంతో అందరూ లోపలికి వెళ్లి 6 అట్టపెట్టెల్లో దాచిన డబ్బును ఎత్తుకెళ్లారు. అందులో దాదాపు రూ.5.80 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఆ డబ్బును మొదటగా ముబారక్ అలీ ఇంట్లో ఉంచారు. దీంతో ముబారక్ అలీ 2 అట్టపెట్టెలను కాజేశాడు. మిగతా 4 బాక్సులను ఈర్షద్ అహ్మద్కు ఇచ్చాడు. రెండు రోజుల తర్వాత ఇంట్లో డబ్బు పోయిందని సైమన్ ప్రసన్న, మోహన్ కొల్లిపురి గుర్తించారు. ఈశ్వర్ కిరణ్కుమార్రెడ్డితో చెప్పగా.. అతను సీసీ టీవీ ఫుటేజి పరిశీలించి, రష్మిత బెహరాయే ఈ చోరీ చేయించినట్లు గుర్తించారు. ఆమె అప్పటికే ఒడిశాకు వెళ్లిపోవడంతో..తన పలుకుబడి ఉపయోగించి అక్కడ కేసు పెట్టించారు. అయినా ఫలితం లేకపోవటంతో మోహన్ కొల్లిపురి, సైమన్ ప్రసన్నలతో వారి బంగారం అంతా తాకట్టు పెట్టించి, ఆస్తులు అమ్మించి డబ్బులు కట్టించుకున్నారు.
లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు కొన్ని రోజులుగా మోహన్ను, అతని సోదరుడు అనిల్కుమార్ను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్కుమార్ ఈ మొత్తం దొంగతనం జరిగిన తీరును సిట్ అధికారులకు వివరించారు. దీనిపై న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అతను చెప్పిన సమాచారం ఆధారంగా ఒడిశా, హైదరాబాద్కు వెళ్లిన సిట్ బృందాలు రష్మితా బెహరా, ఈర్షద్ అహ్మద్, ముబారక్ అలీని పట్టుకుని ప్రశ్నించాయి. దొంగతనం చేసిన సొత్తుతో వీరు ముగ్గురు ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. ఇదంతా మద్యం లంచాల సొమ్మేనని గుర్తించడంతో వాటిని జప్తు చేయడానికి చర్యలు చేపట్టారు











