రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. రామోజీరావు పేరుతో ఆ సంస్థ అందించిన రామోజీ ఎక్స్లెన్స్ అవార్డు కార్యక్రమానికి ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి హాజరయ్యారు. ఈవెంట్లో ఎంత మంది పెద్దలు ఉన్నా.. పబ్లిక్ ఫోకస్ మొత్తం చంద్రబాబు, రేవంత్రెడ్డి మీదనే ఉంది. ఈ ఇద్దరు పక్కపక్కనే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కనిపించారు.
ముఖ్యమంత్రులిద్దరూ అధికారిక హోదాలో హాజరైనా.. ప్రైవేట్ కార్యక్రమం కావడంతో రాజకీయాలు మాట్లాడలేదు. రామోజీరావు గురించి.. ఆయనతో తమకున్న అనుబంధం గురించే చెప్పారు. చంద్రబాబు, రేవంత్ నవ్వుకొంటూ మాట్లాడిన వీడియోలు.. మీడియాలో వైరల్ అయ్యాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయంతో రేవంత్ ఉత్సాహంగా ఉన్నారు. అయితే చంద్రబాబుతో ఈ విషయం గురించి మాట్లాడలేదని తెలుస్తోంది. ప్రస్తుతం బాబు ఎన్డీయేలో ఉన్నారు. ఎన్డీయేలో ప్రధాన పార్టీగా ఉన్న బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి అస్సలు పడదు. అందుకే రాజకీయాల గురించి కాకుండా.. వ్యక్తిగత విషయాలు మాత్రమే మాట్లాడుకొన్నారని సమాచారం.
చంద్రబాబు, రేవంత్ గురుశిష్యులని బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆరే చంద్రబాబు శిష్యుడని రేవంత్ కౌంటర్ ఇవ్వడం కూడా అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ టీడీపీ నుంచే రాజకీయంగా ఎదిగారు. ఆ పార్టీ ద్వారానే అతి తక్కువ కాలంలో స్టేట్ లెవెల్ లీడర్ అయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరారు. అయితే పార్టీ మారినా టీడీపీలో ఉండగా తనకు మద్దతుగా నిలిచిన వారిని ఇప్పటికీ తన వెంటే ఉంచుకోగలిగారు. ఎప్పుడూ చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడకపోవడమూ ఒక కారణం కావొచ్చు. రాజకీయాలు ఎలా ఉన్నా.. ఇలాంటి కార్యక్రమాల్లో అందరితో కలిసిపోవడం ద్వారా టీడీపీ అభిమానులు చేయి దాటకుండా చూసుకొంటున్నారు.
ఈ కలయిక, ఇటు ఏపీ రాజకీయాలలోనూ చర్చనీయాంశంగా మారింది.. గతంలో కేసీఆర్తో చేతులు కలిపి, టీడీపీని ఇరుకునపెట్టారు జగన్.. చంద్రబాబు కక్ష రాజకీయాలకూ దూరంగా ఉంటారనేది వాస్తవం.. కానీ, కేసీఆర్ పవర్ని అడ్డుపెట్టుకొని, ఏపీలో విధ్వంసం సృష్టించాడు వైసీపీ అధినేత.. అయితే, చంద్రబాబు శిష్యుడిగా ముద్రపడిన రేవంత్ రెడ్డి… తనను టార్గెట్ చేస్తారని భావిస్తున్నాడు జగన్… అందుకే, చంద్రబాబు – రేవంత్ భేటీ వైసీపీలో టెన్షన్ పెంచిందనే విశ్లేషణ సాగుతోంది.. మరి, కేసీఆర్ – జగన్ ఈ పరిణామాలను ఎలా జీర్ణించుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది.











