శాసనమండలిలోనూ వేడివాడి చర్చ కన్నా మంత్రుల కామెంట్లతో రచ్చ రేగింది. టీడీపీ అధినేతకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అని మనసులో మాట పుస్తకం అన్నాడని, అది ఇప్పుడు తీసుకువస్తే అందులో చంద్రబాబు ఏమన్నాడో చూపిస్తానంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు మండలిలో కలకలం రేపాయి. బొత్స వ్యాఖ్యలపై లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు ఎక్కడ అన్నాడో చూపాలని ఛాలెంజ్ విసిరారు. రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీలో చర్చను చంద్రబాబు ఎందుకు అడ్డుపడ్డాడని బోత్స వ్యాఖ్యానించారు. తెలుగుదేశం నాయకులు రోడ్లపై వెళితే ప్రజలు చొక్కా పట్టుకుంటారని మరో మంత్రి అనిల్ యాదవ్ చేసిన కామెంట్లతో మండలి హీటెక్కింది. 20 రోజుల్లో రైతులకు పరిహారం చెల్లించాలని సీఎం ఆదేశించారని మంత్రి అనిల్ యాదవ్ గుర్తుచేశారు. వరద నష్టం పై చర్చించే ధైర్యం తెలుగుదేశానికి లేదని అనిల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.
మంత్రుల కామెంట్లను ఖండిస్తూ టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. చంద్రబాబు పై కామెంట్లు చేసిన మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మండలి లో టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. మండలి అదుపు తప్పడంతో డిప్యూటీ ఛైర్మన్ మండలిని రేపటికి వాయిదా వేశారు.