గత ఐదేళ్లుగా జగన్ సర్కార్లోని అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయనపై కేసు నమోదుకు కూడా రెడీ అవుతోంది. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా అసెంబ్లీలో వెల్లడించారు. జగన్ పై నేరుగా కేసు పెడతామని చెప్పనప్పటికీ.. రాష్ట్రంలోని మద్యం కుంభకోణాన్ని తేలిగ్గా వదలబోమని, సీఐడీతో విచారణ చేయిస్తామని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కచ్చితంగా ఆ కేసు జగన్ మెడకు చుట్టుకోనుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీఐడీతో విచారణకు నేరుగా అసెంబ్లీ నుంచే చంద్రబాబు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాయం కూడా తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖపై బుధవారం శాసనసభలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగానే జగన్ తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ చాలా అక్రమంగా ఉందని చంద్రబాబు చెప్పారు. నేరుగా నగదు లావాదేవీలతో అందినకాడికి సొమ్మును వైసీపీ నేతలు దోచేసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. లిక్కర్ ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారని జగన్ లాజిక్ చెప్పారని.. ఆ క్రమంలోనే ఇరుగుపొరుగు రాష్ట్రాల కంటే ధరలు విపరీతంగా పెంచారని చంద్రబాబు గుర్తు చేశారు. అయినా మద్యం వినియోగం బాగా పెరిగిపోయిందని అన్నారు. మరి ఖజానాకు భారీగా రావాల్సిన ఆదాయం మాత్రం రాకుండా.. ఏపీలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం తగ్గిందని అన్నారు.
ఎందుకంటే పెరిగిన ఆదాయం.. నగదు లావాదేవీల ద్వారా లెక్కల్లోకి రాకుండా చేసుకున్నారని.. ఫలితంగా అంతా వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని చంద్రబాబు చెప్పారు. టాప్ లిక్కర్ బ్రాండ్స్ ను తరిమేసి.. లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చి వైన్ షాపుల్లో అమ్మారని అన్నారు. ఈ శ్వేత పత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు మద్యం కుంభకోణం గురించి అనేక విషయాలను చెప్పారు. ప్రభుత్వంలోని వేరే శాఖల్లో డబ్బుల్ని ఎక్సైజ్ శాఖలోకి మళ్లించి.. పెట్టుబడి పెట్టించారని.. దీంతో ఆ ఇతర శాఖలకు దాదాపు రూ.250 కోట్ల నష్టం వచ్చిందని అన్నారు. ఇకపై ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని.. సరైన లిక్కర్ పాలసీలు తీసుకొచ్చి పేదలకు అందుబాటు ధరలో లిక్కర్ దొరికేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు. డీఅడిక్షన్ సెంటర్లనూ ఏర్పాటు చేస్తామని అన్నారు.
మరోవైపు, పవన్ కల్యాణ్ కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ.. వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదని.. కచ్చితంగా వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఈ మేరకు చంద్రబాబును కూడా రిక్వెస్ట్ చేశారు. దీంతో జగన్ కు ఇకపై గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నట్లుగా స్పష్టం అవుతోంది. జగన్ పై పెట్టబోయే తొలి కేసు లిక్కర్ పాలసీ కేసే అనే విషయం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించిన నిర్ణయం ద్వారా స్పష్టం అవుతోంది.