మీ ఇంట్లో అయిదుగురు సభ్యులు ఉన్నారా? ఏ ఒక్కరికైనా కరోనా టెస్టు జరిగిందా? మీ ఇంట్లో అంతమంది లేకపోతే గనుక.. మీ ఇంటికి కుడి ఎడమ ఉండే ఇళ్లలో ఎవరికైనా జరిగిందా? అది కూడా లేకపోతే.. మీ వీధి, మీ వాడ, మీ పల్లెలో ఎంత మందికి పరీక్షలు జరిగాయో ఓసారి గుర్తు చేసుకోండి. అప్పుడు ప్రభుత్వం చెబుతున్న లెక్కల మీద అనుమానాలు వస్తాయి. ఎందుకంటే.. రాష్ట్రంలో కోటి మందికి అటే.. ప్రతి ఐదుగురిలో ఒకరికి పరీక్షలు నిర్వహించాం అని ప్రభుత్వం గర్వంగా ప్రకటించుకుంటోంది.
ఏపీలో కరోనా టెస్టులపై ప్రభుత్వం చెబుతోన్న గణాంకాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కోటి కోవిడ్ టెస్టులు చేశామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన ఈ గణాంకాలు నిజమైతే, మొత్తం జనాభాలో 20 శాతం మందికి కరోనా టెస్టులు చేసినట్టే. ఎందుకంటే ఏపీ జనాభా 5 కోట్లు. అందులో కోటి కోవిడ్ టెస్టులు చేస్తే, మొత్తం జనాభాలో 20 శాతం మందికి కరోనా పరీక్షలు చేసినట్టే లెక్క. అంటే ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా టెస్టులు చేసినట్టే అనుకోవాలి. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ప్రభుత్వ గణాంకాలపై అనేక అనుమానాలు రాకమానవు.
20 శాతం జనాభాకు కోవిడ్ టెస్టులు చేశారా?
ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 9 లక్షలకు చేరువైంది. కొత్తగా ప్రతిరోజూ 600పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికీ ప్రతి రోజూ 50 వేల కోవిడ్ టెస్టులు చేస్తున్నామని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడిస్తూనే ఉంది. అయితే వారి గణాంకాలను ప్రజలు నమ్మడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి మూడు కుటుంబాల్లో ఇద్దరికి కరోనా టెస్టులు చేసి ఉండాలి. కానీ అలా జరగలేదు. ప్రతి గ్రామంలో 50 నుంచి 100 వరకూ కరోనా టెస్టులు మాత్రమే చేశారని స్థానికులు వెల్లడిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో 20 శాతం జనాభాకు కరోనా టెస్టులు పూర్తి చేశామని చెబుతోంది. ఇది నమ్మశక్యంగా లేదని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఎందుకీ కాకి లెక్కలు?
కరోనా పరీక్షలు వాస్తవానికంటె అధికంగా చేసినట్లు ప్రకటించుకుంటే ప్రభుత్వానికి ఏం వస్తుంది? అబద్ధాలు చెప్పవలసిన అవసరమేంటి? అనే సందేహాలు ఎవరికైనా కలుగుతాయి. దీనికి ఒక వాదన వినిపిస్తోంది.
కరోనా టెస్టుల ఖర్చంతా కేంద్రమే భరిస్తోంది. అందుకే ఏపీ ప్రభుత్వం కరోనా టెస్టులను ఎక్కవ చేసి చూపిస్తోందనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే హైమాస్క్ కరోనా శాంపిళ్లు సేకరించే బస్సులను నిలిపివేశారు. మండల కేంద్రాల్లోనూ కరోనా శాంపిల్స్ సేకరించడం లేదు. అయినా నేటికీ ప్రతి రోజూ 50 వేల కరోనా టెస్టులు చేస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటిస్తూనే ఉంది. ఈ గణాంకాలపై అనేక అనుమానాలు రావడం సహజం. దీనిపై ప్రతిపక్షాలు అసెంబ్లీలో కూడా లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి.











