వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఇంట కలకలం రేగింది. కాపు కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డా.. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు కాపు వర్గంలో కలకలం రేపుతున్నాయి. అక్రమ మైనింగ్ లో కింగ్ గా ఎదిగిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సోదరుడి కుమారుడితో వ్యాపార బంధం కారణంగానే ప్రవీణ్ ఆత్మహత్యాయత్నం చేశారన్న వార్తలు మొత్తం జగన్ శిబిరంలోనే కలకలం రేపుతోంది.
అక్రమాల నుంచి రక్షణకే రాజకీయాలు..
అక్రమాలకు పాల్పడటం, వాటిని కప్పిపుచ్చుకునేందుకు రాజకీయాల్లోకి రావడంపై గాలి జనార్దన్ రెడ్డిని చూసే నేర్చుకోవాలి. ఎందుకంటే.. కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో చిన్న వ్యాపారిగా ప్రస్థానం మొదలెట్టిన గాలి జనార్దన్ రెడ్డి.. చాలా తక్కువ సమయంలోనే కోట్లకు పడగలెత్తారు. అయితే అనతికాలంలోనే కోటీశ్వరుడిగా మారిన గాలి.. తప్పనిసరి పరిస్థితుల్లోనే తనను తాను కాపాడుకోవాలనే కోణంలో ఆలోచించాకే రాజకీయాల్లోకి వచ్చారన్న ప్రచారం సాగింది. ఆ వాదనలు నిజమేనన్నట్లుగా రాజకీయాల్లోకి వచ్చాక.. గాలి తనదైన శైలిలో చక్రం తిప్పారు. బళ్లారిని సామంతరాజ్యంలా మార్చుకుని పాలన సాగించారు. ఆ తర్వాత ఏపీలో వైఎస్సార్ సర్కారు రాగానే.. కర్ణాటక సరిహద్దు అనంతపురం జిల్లాకు చెందిన ఓబుళాపురంలో అక్రమ మైనింగ్ కు తెర తీసి బిలియనీర్ అవతారం ఎత్తారు. ఈ వ్యవహారంలో దోషిగా తేలిన ఆయనకు జైలు శిక్ష కూడా పడింది.
గాలి ఫ్యామిలీతో రామచంద్రారెడ్డి బంధం
ఇదంతా ఇప్పుడెందుకంటే.. గాలి ఫ్యామిలీకి, కాపు ఫ్యామిలీకి మధ్య మంచి దోస్తానా ఉందన్న వార్తలు గతంలోనే వినిపించాయి కదా. ఇప్పుడు కాపు కుమారుడి ఆత్మహత్యాయత్నానికి కూడా గాలి ఫ్యామిలీతో సంబంధాలే కారణంగా నిలుస్తున్నాయి. ఆ వివరాలేంటంటే.. గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి ప్రస్తుతం బళ్లారి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఈ సోమశేఖరరెడ్డి కుమారుడు శ్రవణ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓ కార్ల షోరూమును ప్రారంభించారట. షోరూంకు సంబంధించిన లెక్కలు చెప్పాలంటూ ఎమ్మెల్యే సోమశేఖర్రెడ్డి పలుమార్లు అడగడంతో శ్రవణ్, ప్రవీణ్ ల మధ్య విభేదాలు పొడసూపాయట.
కాపు కొడుకును గాలి తమ్ముడు బెదిరించాడా?
ఈ విభేదాలు అంతకంతకూ పెరిగిపోయి ఇటీవల మరింత తీవ్ర రూపం దాల్చాయట. ఈ క్రమంలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన ప్రవీణ్ మనస్తాపానికి గురైన కార్ల షోరూంలోనే ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దీనిని గమనించిన వారి స్నేహితులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ ప్రస్తుతం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయినా మధ్యవర్తుల మధ్య లావాదేవీలకు సంబంధించిన లెక్కలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు కదా. మరి ఈ లెక్కలను సోమశేఖరరెడ్డి అడగంగానే.. ప్రవీణ్, శ్రవణ్ ల మధ్య విభేదాలు ఎందుకు ప్రారంభమయ్యాయన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది. అయినా సోమశేఖరెడ్డి అడిగితే… అయితే గియిలే శ్రవణ్ ఇబ్బంది పడాలి గానీ.. ప్రవీణ్ భయపడటం ఏమిటి? సోమశేఖరరెడ్డి నుంచి బెదిరింపులు ఏమైనా ప్రవీణ్ కు ఎదురయ్యాయా? అన్న కోణంలో ఆసక్తికర ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తంగా గాలి సోదరులతో కాపు రామచంద్రారెడ్డి బంధం.. ఈ ఘటనతో మరోమారు బయటపడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.











