కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డు శ్రీనివాస్ సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తులు పోతురాజు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ, జనసేన ఆర్.ఎస్.ఎస్. సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హిందువుల మనోభావాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఆందోళన జరుగుతున్న ప్రదేశానికి గుడివాడ డీఎస్పీ సత్యానందం వెళ్లడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
విగ్రహం ధ్వంసంలో కుట్ర కోణం ఉందంటూ బి.జె.పి.,జనసేన, హిందు సంఘాల నాయకులు ఆరోపించగా, ఇది చాలా చిన్న విషయమని ఈ చిన్న విషయాన్ని పెద్దది చేయొద్దనడంతో డీఎస్పీకి హిందు సంఘాలకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుని చిలికి చిలికి గాలివాన మాదిరిగా తయారయింది. చివరకు బీజేపీ, జనసేన, ఆర్.ఎస్.ఎస్.కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది.
ఆ పిదప ఈ సంఘటనపై జిల్లా ఎస్.పి. వివరణ ఇస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చర్యలు చేపడితే సహించేది లేదని, వ్యక్తిగత దురలవాట్ల కారణంగా చేసిన నేరాన్ని మతసామరస్యాన్ని దెబ్బతీసేలా నిరసన తెలపడం చట్టరీత్యా నేరం అంటూ జిల్లా ఎస్.పి.రవీంద్రనాధ్ బాబు ఈ సంఘటనపై హెచ్చరికలు జారీచేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఏ అంశం గురించి అయినా, ఏ మతానికి సంబంధించినదైనప్పటికి వాస్తవాలు తెలుసుకున్న పిదప నిరసన కార్యక్రమం చేపట్టాలి తప్ప, వెనుకా ముందూ ఆలోచించకుండా వారి యొక్క రాజకీయ, వ్యక్తిగత లబ్ధి కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం వంటి కార్యక్రమాలు చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడమే కాక క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్.పి. హెచ్చరించారు.
గుడివాడ రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని స్వంత నియోజకవర్గం కావటంతో పోలీసులు మంత్రిగారి మెప్పుకోసం, అధికారపార్టీ అండదండలు కోసమో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఒక మతానికి చెందిన వారి మనోభాలను దెబ్బతిసే ప్రయత్నం చేస్తూ హెచ్చరించటం సమంజసం కాదని హిందు సంఘాలు ఆందోళన వ్యక్తంచేసాయి.
ఒక ప్రక్క రాష్ట్రంలో హిందూత్వం మీద దాడులు జరుగుతున్నాయనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గుడివాడలో వెలుగుచూసిన మరో దారుణ ఘటనను పోలీసులే పలుచన చేయడానికి ప్రయత్నిస్తున్నారా? అనే వాదన ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఈ ఘటనకు భాద్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పకుండా, చిన్నపాటి సంఘటనలు పెద్దవిచేస్తూ ఆందోళనలు చేస్తారా అంటూ పోలీసులే ప్రశ్నించటం ఎంతమేరకు సమంజసమో ఆలోచించాలి. పోలీసులు రేచ్చగొట్టే ధోరణి లో మాట్లాడం చూస్తుంటే ఈ చర్యలు ఏ పరిస్థితికి దరితీస్తుందో చూడాలి.
చివరకు పోలీసులు ఈ సంఘటనకు భాద్యులైన వారిని అరెస్ట్ చేయటంతో ఈ వివాదం సద్దుమణిగింది.











