తిరుపతిలో గురువారం అంతా హైడ్రామా నడిచింది. తిరుపతి రూరల్ మండలం LSనగర్లోని TTD గోసంరక్షణ శాలలో మూణ్నేళ్లలోనే 100కుపైగా ఆవులు మరణించాయని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించడం వివాదానికి దారి తీసింది. భూమన ఆరోపణలపై స్పందించిన టీడీపీ ఆవులు చనిపోయినట్లు నిరూపించాలంటూ వైసీపీ అధినేత జగన్కు సవాల్ విసిరింది. దమ్ముంటే టీటీడీ గోశాలకు రావాలని పిలుపునిచ్చింది. సవాల్ మేరకు ఉదయం తొమ్మిది గంటలకే తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, మదనపల్లె ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్రెడ్డి, గురజాల జగన్, మురళీమోహన్, షాజహాన్ బాషాతో పాటు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ నేతలు నరసింహయాదవ్, చల్లా బాబు, జనసేన అధ్యక్షుడు హరిప్రసాద్ ఒక్కొక్కరుగా గోశాలకు వచ్చారు. అక్కడే ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం దగ్గర బైఠాయించారు. మధ్యాహ్నం వరకు జగన్, భూమన కోసం టీడీపీ నేతలు వేచి చూశారు.
ఈ సందర్భంగా వైసీపీ తీరుపై కూటమి నేతలు మండిపడ్డారు. భూమన టీటీడీ ఛైర్మన్గా ఉన్నప్పుడే లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు, అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ నిర్ధారించిందన్నారు. త్వరలోనే భూమనపై చర్యలు ఉంటాయన్నారు. నాస్తికుడైన భూమన హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని, వృద్ధాప్యం, అనారోగ్యంతో 3 నెలలో 43 ఆవులు చనిపోగా..100కుపైగా చనిపోయాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ఆరోపణలపై బదులిచ్చేందుకు గోశాల వద్దకు రావాలని మేం సవాలు చేస్తే, ఆయన డ్రామాలకు తెరతీశారంటూ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నివర్ తుపాను సమయంలో ఇదే గోశాలలో 85 లేగదూడలు చనిపోయాయని, ఆవులను పట్టించుకోకపోగా, తప్పుడు లెక్కలతో రూ.కోటి దోచేశారని ఆరోపించారు. సుబ్బారెడ్డి ఛైర్మన్గా ఉన్నప్పుడు పలమనేరు గోశాల నుంచి ఒంగోలుకు అక్రమంగా ఆవులు తరలించడానికి యత్నిస్తే మేమే అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
గురువారం ఉదయం 9కి SVU నుంచి ర్యాలీగా గోశాలకు వెళ్లాలని కూటమి నేతలు నిర్ణయించారు.ఐతే శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు సూచించడంతో ర్యాలీగా కాకుండా విడివిడిగా గోశాలకు చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను మాత్రమే పోలీసులు లోపలకు అనుమతించారు. అదే సమయంలో భూమన కరుణాకరరెడ్డి మాత్రం వైసీపీ కార్యకర్తలతో కలిసి వెళ్తానని పద్మావతిపురంలోని తన ఇంటి వద్ద ప్రకటించారు. భూమనతో పాటు వైకాపా ఎంపీ గురుమూర్తిని బందోబస్తుతో పంపిస్తామని పోలీసులు చెప్పినా, భూమన అంగీకరించలేదు. తన నివాసం వద్ద పార్టీ నేతలు గురుమూర్తి, నారాయణస్వామి, రోజా, చెవిరెడ్డి మోహిత్రెడ్డితో కలిసి బైఠాయించారు. కాసేపు అక్కడే నేలపై పడుకున్నారు.
ఫోన్ చేసి పిలిచినా రాలేదు –
గోశాళ దగ్గర గంటల కొద్ది నిరీక్షించాక, చివరకు ఎమ్మెల్యేలు పులివర్తి, సుధీర్ రెడ్డి భూమనకు ఫోన్ చేసి త్వరగా రావాలని కోరారు. పోలీసుల ఎస్కార్ట్తో తీసుకొచ్చే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. తాను ఇంట్లోనే ఉన్నానని, బందోబస్తు కల్పిస్తే నాయకులు, కార్యకర్తలతో కలిసి వస్తానని భూమన బదులిచ్చారు. కానీ, కాసేపటికి ఎంపీ గురుమూర్తి, కరుణాకరరెడ్డి తనయుడు అభినయ్రెడ్డి గోశాల వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఎంపీని లోపలికి తీసుకెళ్లగా, కరుణాకరరెడ్డి ఎక్కడా అంటూ కూటమి నేతలు ప్రశ్నించారు. తానే దొడ్డిదారిలో వచ్చానని, భూమనను రానివ్వడం లేదని, ఆయనొస్తే ఆవుల మృతిపై మీ అందరికీ జవాబిస్తారని గురుమూర్తి వాదించారు.
పోలీసులు ఎక్కడా అడ్డుచెప్పలేదని, రావాలనుకుంటే మీతోపాటే కరుణాకరరెడ్డీ వచ్చేవారని ఎంపీ గురుమూర్తిని కూటమి నేతలు నిలదీశారు. మధ్యాహ్నం ఒంటి గంటదాకా నిరీక్షించినా, భూమన రాకపోవడంతో నేతలంతా వెనుదిరిగారు.
మరోవైపు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై తిరుపతి SVU పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై అసత్య ఆరోపణలు చేసి, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, టీటీడీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్రెడ్డి రెండ్రోజుల కిందట ఎస్పీ హర్షవర్ధన్రాజుకు ఫిర్యాదు చేశారు. న్యాయ సలహా తీసుకున్న పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు.