రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన ఆ ఘటన పెద్ద ఉదాహరణ. సరిగ్గా మూడేళ్ల క్రితం (సెప్టెంబర్ 9, 2023న) నాటి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం FIR కూడా చూపకుండా TDP అధినేత చంద్రబాబుని అరెస్టు చేసింది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష నేతను అరెస్టు చేసిరాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు ఉంచడం ఏపీ రాజకీయ చరిత్రలోనే అన్యాయంగా మిగిలిపోయింది. ఆనాడు పలువురు సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెప్పినట్లుగా…జగన్ తన గొయ్యి తాను తవ్వుకున్నారు అనే మాట అక్షరాలా నిజమైంది.
ఆనాడు కక్షపూరితంగా వ్యవహరించి, చంద్రబాబును జైల్లో పెడితే TDP మానసికంగా కుంగిపోతుందని జగన్ వర్గం భావించింది. కానీ, ఆ అరెస్టే వైసీపీ కొంపముంచింది. ఆ కష్టకాలంలోనే నారా లోకేష్ బాధ్యతను భుజానికెత్తుకుని ప్రజల్లోకి వెళ్లారు. చంద్రబాబు నిర్బంధాన్ని, జగన్ దుర్మార్గపు పాలనను నిలదీస్తూ సాగించిన ప్రయాణం అప్పట్లో ప్రజల్లో సింపతీని తీసుకువచ్చింది. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవస్థలను దుర్వినియోగం చేస్తే, అంతిమంగా ప్రజలు ఎలా తిరగబడతారో ఎన్నికల ఫలితాలు కళ్లకు కట్టాయి.
వైసీపీ కుట్రలను, అక్రమ అరెస్టులను సామాన్య ప్రజలు సైతం తీవ్రంగా అసహ్యించుకున్నారు. అణచివేతకు గురైన నాయకుడికి అండగా నిలిచేందుకు టీడీపీ శ్రేణులు, కూటమి భాగస్వాములు, జనం అంతా ఒక్కటయ్యారు. ఆనాడు వేధించిన తీరే.. తదనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవానికి దారి తీసింది. కూటమి ప్రభుత్వాన్ని తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి తెచ్చింది.
వైసీపీ పాలకులు చేసిన ఆ పెద్ద తప్పును ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే, ఆ చీకటి రోజును గుర్తుచేస్తూ ఇవాళ మంత్రి నారా లోకేష్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా నిజం గెలిచింది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆ 53 రోజుల జైలు జీవితం తెచ్చిన మార్పు కేవలం ఒక పార్టీ విజయం మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యంలో అహంకారానికి, కక్షసాధింపు రాజకీయాలకు పడిన శాశ్వత శిక్ష. అధికారమనేది శాశ్వతం కాదని, ఎంతటివారైనా కాలం ఎదురు తిరిగితే ఆ గొయ్యిలో నుంచి బయటపడలేరని జగన్, వైసీపీ అనుభవమే నేడు స్పష్టం చేస్తోంది.











