ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతూ ఉన్నాయి. తెలుగు దేశం పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ నేపథ్యంలో జాతీయ పార్టీలు సైతం తమ మనసును మార్చుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల కోసం టీడీపీ – జనసేన పొత్తు ఖరారు అవగా, బీజేపీ మాత్రం వాటికి దూరంగా ఉంది. కానీ, బీజేపీ – జనసేన మాత్రం పొత్తులో ఉన్న పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ – జనసేనతో బీజేపీ కలుస్తుందా అనే విషయంలో సందిగ్ధం నెలకొని ఉంది. కానీ, తాజా పరిణామాలు బీజేపీ ఆ పొత్తులో కలిసే అవకాశాలను స్పష్టం చేస్తున్నాయి.
టీడీపీ – జనసేనతో బీజేపీ పొత్తుకు లైన్ క్లియర్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో మోదీ, అమిత్ షా టీమ్ నేతలు చంద్రబాబుని కలుస్తారని తెలుస్తోంది. ఏపీ రాజకీయాల విషయంలో చంద్రబాబు ఎలాంటి అడుగులు వేయబోతున్నారు? ఏ వ్యూహాలను అమలు చేయబోతున్నారనే అంశాలను తెలుసుకొనే పనిని ఏపీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్కు అప్పగించింది. చంద్రబాబు రూట్ మ్యాప్ పై నిఘా ఉంది. దీనికి సంబంధించి ఇటీవలే ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు మరో అంశంలో చంద్రబాబుని కలిశారని తెలుస్తోంది. వారు ఓ నివేదికను జగన్ కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
బీజేపీ.. టీడీపీతో కలవాలని ఆసక్తిగా ఉందనడానికి ఇటీవలే మరో పరిణామం జరిగింది. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఏపీ బీజేపీ తీర్మానం చేసింది. ఇది చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఒంగోలులో జరిగిన తమ పార్టీ సమావేశంలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తీర్మానం చేశారు. బీజేపీ నేషనల్ సెక్రటరీ బీఎల్ సంతోషం ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగడం గమనించదగ్గ విషయం. ఏపీలో టీడీపీ, జనసేనతో కలవాలని బీజేపీ అనుకుంటున్నప్పటికీ, కలుపుకునేందుకు టీడీపీ ఆసక్తిగా లేదని, అందుకే జగన్ పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబుకు మద్దతుగా ఈ తీర్మానం చేసినట్లుగా భావిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీతో బీజేపీకి ఉన్న మంచి సంబంధాల నేపథ్యంలో చంద్రబాబు అరెస్టును ఖండించడం ద్వారా తాము టీడీపీతో కలవడానికి ఆసక్తిగా ఉన్నామనే సంకేతం పంపడం కోసం ఈ తీర్మానం చేసినట్లుగా చెబుతున్నారు.











