నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు భారీ షాక్ తగిలింది. బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాన్ని తీసుకొని దానిని తిరిగి చెల్లించకుండా కనీసం వడ్డీ కూడా కట్టకుండా ఆ రుణాన్ని వ్యాపారం కోసం కాకుండా దారి మళ్ళించారంటూ ఆయనపై ఫిర్యాదులు నమోదయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు చీఫ్ మేనేజర్ సౌరభ్ మల్హోత్రా మార్చి 21న రఘురామపై కేసు నమోదు చేశారు. ఈ కేసును నమోదు చేసుకున్న సీబీఐ అధికారులు విచారణ జరిపారు. గురువారం ( అక్టోబర్ 8)న హైదరాబాద్, ముంబై, పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 11 చోట్ల సోదాలు జరిపారు. ఈ సోదాలలో పలు కీలక ఫైళ్లను అధికారులు సొంతం చేసుకున్నారు.
కేసు నేపథ్యం
రఘురామ కృష్ణరాజుకు చెందిన ఇండ్-భారత్ సంస్థకు వివిధ బ్యాంకులు 1000 కోట్లకు పైగా రుణాన్ని అందించాయి. కర్ణాటకలో విద్యుత్ ఉత్పత్తి సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు రఘురామ బ్యాంకులకు డాక్యూమెంట్స్ అందచేశారు. ఆ తరువాత ఈ సంస్థను కర్ణాటక నుంచి తమిళనాడులోని ట్యుటుకోరిన్కు మార్చారు. సంస్థ బదలాయింపు సమయంలో నిధులు గోలుమాల్ జరిగినట్లు సీబీఐ నిర్దారించింది. ఈ సంస్థ కోసం కొనుగోలు చేసిన బొగ్గు విషయంలో కూడా తప్పుడు బిల్లులు చూపించినట్లు అధికారులు గుర్తించారు.
భారీ ఎత్తున బొగ్గు కొనుగోలు చేసినట్లు రిటర్న్స్ లో చూపిన ఆ సంస్థ ఆడిట్ లో మాత్రం రుజువులు చూపలేకపోయింది. దీనికి రుజువులు అడిగిన బ్యాంకులకు ఆ సంస్థ తప్పుడు సమాచారం అందించిందని సీబీఐ తమ ఎఫ్ఐఆర్ లో తెలిపింది. ఈ అవకతవకలపై బ్యాంకు సంస్థలు ఇప్పటికే ఆ సంస్థను పలుమార్లు హెచ్చరించాయి. కానీ ఎటువంటి మార్పులు లేకపోవడంతో డీఫాల్ట్ కంపెనీగా ప్రకటించారు.
ఇండ్-భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్, డైరెక్టర్లు కనుమూరు రమాదేవి, రఘురామకృష్ణరాజు, కోటగిరి ఇందిర ప్రియదర్శిని, గోపాలన్ మనోహరన్, నంబూరి కుమారస్వామి, ఎండీ సీతారామం కొమరగిరి, అడిషనల్ డైరెక్టర్లు నారాయణ ప్రసాద్ భాగవతుల, బొప్పన సౌజన్య, వీరవెంకట సత్యనారాయణరావు వడ్లమాని, విస్సాప్రగడ పేర్రాజు కలిసి లబ్ధిపొందేందుకు ప్రయత్నించి రూ. 826.17 కోట్ల నష్టం కలిగించినట్టు సౌరభ్ మల్హోత్రా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనుమానాలు
ఎవరైనా చట్టానికి చుట్టాలు కారు. తప్పు చేస్తే తప్పే. కానీ కేసు నమోదు చేసిన నేపథ్యంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా రఘురామ సొంతపార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా జగన్ చేసిన ఢిల్లీ పర్యటనపై కూడా వ్యంగ్యంగా స్పందించారు. మంత్రివర్గంలో వైసీపీని బీజేపీ చేర్చుకోదని రాజు గారు జోస్యం కూడా చెప్పారు. వైసీపీ నాయకుల హడావిడి తప్పా అంతకు మించి ఈ పర్యటన వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. కానీ కొన్ని గంటలు గడవకముందే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు రఘురామకు చెందిన 11 సంస్థలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల వెనుక వైసీపీ ప్రభుత్వం ఉందంటూ విమర్శలు ప్రచారం జరుగుతున్నాయి. రఘురామకు ముకుతాడు ఎలా వేయాలని ఆలోచిస్తున్న వైసీపీ పెద్దలు ఢిల్లీ పర్యటనను ఓ అవకాశంగా వాడుకున్నట్లు తెలుస్తోంది. మోడీతో జరిగిన భేటీలో జగన్ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు వార్తలు వినబడుతున్నాయి. దీంతో రాజుగారిపై సీబీఐ దాడులు జరిగినట్లు విమర్శలు వినబడుతున్నాయి.











