సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించుకునే యత్నంలో భాగంగా చైనా ప్రయోగించిన భారీ రాకెట్ లాంగ్ మార్చ్ 5B రాకెట్ తిరుగు ప్రయాణంలో నియంత్రణ కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ రాకెట్ ఎక్కడ కూలుతుందోనన్న టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది.ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలికొంది.కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసింది.ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది.తాజాగా లాంగ్ మార్చ్ 5B రాకెట్ విషయంలో ప్రపంచంలోని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు చైనా నోరు విప్పింది.ఆ రాకెట్తో ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది.తమ రాకెట్ లాంగ్ మార్చ్ 5B భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోతుందని,మండే స్వభావం లేని కొన్నిలోహాలు మాత్రమే చిన్న ముక్కలుగా మారతాయని, అవి సముద్రంలోనే పడే అవకాశ ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తెలిపారు.భారీ నష్టం ఉంటుందనేది కేవలం ప్రచారమేనని వ్యాఖ్యానించారు.
ఆ ప్రకటనతో ఆందోళన..
కాగా గురువారం అమెరికాకు చెందిన హార్వర్డ్ స్మితోజియన్ ఆస్ట్రో ఫిజికల్ అబ్జర్వేటరీ ఖగోళ శాస్త్రజ్ఞుడు జోనాథన్ మెక్ డోవెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అదుపు తప్పిన లాంగ్ మార్చ్ 5B రాకెట్ భారత రాజధాని ఢిల్లీ పైన పడే అవకాశాలు ఉన్నాయనే ప్రకటనతో భారత్ ఉలిక్కి పడింది.ప్రస్తుతం 41.5 డిగ్రీల కోణంలో దూసుకొస్తున్న ఈ రాకెట్ సెకనుకు నాలుగు మైళ్ల వేగంతో వస్తుందని, అయితే ధిల్లీపై పడే అవకాశాన్ని కూడా కొట్టివేయలేమని వ్యాఖ్యానించారు.భూమధ్య రేఖకు ఉత్తర, దక్షిణ భాగాలలో 41.5 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాలలో ఎక్కడైనా లాంగ్ మార్చ్ 5B కుప్ప కూలొచ్చని చెప్పిన జోనాథన్ ఈ రాకెట్ను మళ్లీ ఆధీనంలోకి తెచ్చుకునే యత్నంలో చైనా ఉండొచ్చని పేర్కొన్నారు.ఈ రాకెట్ ఒక వేళ ఢిల్లీ పై పడకుంటే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, బ్రెజిల్లోని రియో డి జెనీరియా నగరం,బీజింగ్ నగరాలపై పడే అవకాశం కూడా ఉందన్నారు.
నాసా ప్రకటన
మరోవైపు లాంగ్ మార్చ్ 5B గమనంపై ప్రపంచంలోని పలు దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.అదే సమయంలో అమెరికా కూడా కీలక ప్రకటన చేసింది.ఈ రాకెట్ భూమిపై పడే పరిస్థితి వస్తే..దాన్ని పేల్చివేస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా అమెరికా రక్షణశాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ రాకెట్ను కూల్చివేసే సామర్థ్యం, నైపుణ్యం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ప్రణాళిక లేదని,అవసరానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.చైనా నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించిన ఆస్టిన్ ఆ రాకెట్ సముద్ర జలాలు లేదా భూమిపై ఏ ప్రాంతంలో పడినా ఎలాంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. గంటకు 18వేల కిలోమీటర్ల వేగంతో వస్తున్నరాకెట్ గమనాన్ని కేవలం అంచనా వేస్తున్నామని వ్యాఖ్యానించారు. కొన్ని గంటల ముందు తప్ప ఎక్కడ కూలుతుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదని నాసా ప్రకటించింది.భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11గంటలు ఆదివారం ఉదయం 10గంటల మధ్య ఇది భూమిపై లేదా సముద్రంలో కూలుతుందన్న అంచనాలున్నాయి.కాగా ఏప్రిల్ 29న దాదాపు 21 టన్నుల మొత్తం బరువు ఉన్న Long March 5b రాకెట్ను ప్రయోగించింది. కోర్ మాడ్యూల్ను అంతరిక్షకేంద్రంలోకి తీసుకెళ్లాక నియంత్రణ కోల్పోయిన విషయం తెలిసిందే.భూమిపైకి తిరిగి వస్తున్నఈ రాకెట్ నికర బరువు దాదాపు 18టన్నులుగా అంచనా వేస్తున్నారు.