గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో పట్టా భూముల్లో చనిపోయిన వారి పేరుతో ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకుని దోపిడీకి పాల్పడ్డారంటూ లియో న్యూస్ ప్రచురించిన ఇసుకాసురులు ఆత్మలకు కూడా బురిడీ కొట్టించగలరు కథనంపై టీడీపీ నేతలు స్పందించారు. వేమూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు గుంటూరు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈపూరులో చనిపోయిన వ్యక్తుల పేరుతో అనుమతులు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టా భూముల పేరుతో ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకుని వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున దోపిడీకి పాల్పడ్డారని నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు.
చెలరేగిపోయిన అక్రమార్కులు
అక్రమార్కులు పట్టా భూముల్లో చనిపోయిన వారితో దరఖాస్తు చేసుకున్న నాలుగు రోజుల్లోనే ఐదు శాఖల అధికారులు అనుమతులు మంజూరు చేయడంపై టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు అనుమానం వ్యక్తం చేశారు. పట్టాభూముల్లో వరదకు మేట వేసిన ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకుని, ఆ ఇసుకను ఏపీఎండీ ద్వారా మాత్రమే అమ్మాలని ఆయన గుర్తు చేశారు. కానీ ఈపూరులో మాత్రం అలా జరగలేదని ఆనందబాబు పేర్కొన్నారు.
వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జునపై ఆరోపణలు
ఈపూరులో పట్టా భూముల్లో ఇసుక అక్రమ తవ్వకాల్లో వేమూరు వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జునపై విచారణ జరిపించాలని నక్కా ఆనందబాబు కలెక్టర్కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. ఓలేరు వద్ద ఇసుక అక్రమ రవాణా పై బాధితులు ఇప్పటికే హాకోర్టును ఆశ్రయించారు. ఓలేరు ఇసుక రవాణాపై విచారణ కోరిన ఎమ్మెల్యే నాగార్జున ఈపూరు విషయంలో కూడా విచారణ కోరాలని ఆనందబాబు డిమాండ్ చేశారు. చనిపోయిన వారి పేరు మీద అనుమతులు ఇచ్చిన సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆయన కలెక్టర్ను కోరారు. పది రోజుల్లో విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే హైకోర్టుకు వెళతామని ఆనందబాబు వెల్లడించారు.
లియో న్యూస్ చెప్పిందే నిజమైంది
చనిపోయినవారి పేరుపై అనుమతులు తీసుకుని ఈపూరులో భారీ ఎత్తున ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ లియో న్యూస్ ప్రచురించిన వార్తపై టీడీపీ నేతలు స్పందించారు. పలు ప్రజా సంఘాలు కూడా ఇసుక అక్రమ రవాణాపై ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.