ఏపీలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయాందోళనలు నెలకొన్నాయని…చినజీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుంటూరు జిల్లా సీతానగరంలో మీడియాతో మాట్లాడుతూ గుర్తు చేశారు. ఏపీలో దేవాలయాల్లో విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయాల పరిరక్షణకు ఈ నెల 17 నుంచి ఏపీలో ధ్వంసమైన ఆలయాల సందర్శన ప్రారంభించనున్నట్టు చినజీయర్ ప్రకటించారు.
దేవాలయాలను పరిరక్షించాలి
ఏపీలో దేవాలయాలను పరిరక్షించాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే చేయాలని చినజీయర్ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. ధ్వంసమైన దేవాలయాలు, విగ్రహాల విషయంలో ఏం చేయాలనే దానిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతి ఆలయ రక్షణకు సీసీ కెమెరాలు వెంటనే ఏర్పాటు చేయాలని చినజీయర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆలయాల ట్రస్టులను పూర్తిగా నిర్మూలించారని చినజీయర్ తప్పుపట్టారు. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎవరూ దేవాలయాల పరిరక్షణ బాధ్యత తీసుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.