ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తన సొంత జిల్లా కడప నుంచి ప్రచారం మొదలుపెట్టారు. ఆమె కడప ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. పార్లమెంటు అభ్యర్థిగా తొలిసారి కడప పరిధిలో షర్మిల బస్సు యాత్రలో పాల్గొన్నారు. నేడు బద్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ప్రచారం చేయగా.. ఆమె ప్రసంగం అంతా ఆసక్తికరంగా సాగింది.
వైఎస్ షర్మిల తన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హ** కేసును అస్త్రంగా చేసుకొనే బరిలోకి దిగారు. దీంతో ఆమె ప్రధాన లక్ష్యం వైఎస్ జగన్, తన ప్రత్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి అయ్యారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. షర్మిల తన మొదటి రోజు కడప ఎన్నికల ప్రచారంలో వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా.. ఏపీ అభివృద్ధి చెందాలంటే.. హ** రాజకీయాలకు స్వస్తి పలకాలంటే.. జగన్ ను ఓడించి తీరాలని వైఎస్ షర్మిల పిలుపు ఇచ్చారు. తన బాబాయి కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికే మళ్లీ వైసీపీ అధినేత టికెట్ ఇచ్చారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ ఇన్నాళ్లు వాడుకున్నారని.. మళ్లీ ఆ పదవిని పదిలపర్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
కడప పార్లమెంట్ నుంచి తాను ఎంపీగా పోటీ చేయడానికి కారణాన్ని కూడా షర్మిల చెప్పేశారు. తన బాబాయి వివేకాను హ** చేయించిన వారికే మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చినందునే తాను నేరుగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. హంతకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి చట్టసభలకు వెళ్లకూడదని షర్మిల అన్నారు. కడపలో పోటీలో ఓ వైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉండగా.. మరోవైపు వివేకానంద రెడ్డిని హ** చేయించిన అవినాష్ రెడ్డి ఉన్నారని షర్మిల చెప్పారు. ధర్మం కాపాడడం కోసం ఒకవైపు తాను.. మరోవైపు డబ్బుతో అధికారాన్ని కొనాలనుకొనే వ్యక్తి ఉన్నారని.. ఎవర్ని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించాలని వైఎస్ షర్మిల పిలుపు ఇచ్చారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. తన తండ్రి వివేకానంద రెడ్డిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందని అన్నారు. తన తండ్రిని అతి క్రూరంగా చంపేసిన వారే ప్రస్తుతం కడప బరిలో ఉన్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండుంటే దీన్ని ఏ మాత్రం సహించేవారు కాదని అన్నారు. వైఎస్ షర్మిలను ఎంపీ చేయాలనేది తన తండ్రి చివరి కోరిక అని సునీత చెప్పారు. అవినాష్ రెడ్డిని ఓడించి వైఎస్ కోరిక నెరవేర్చాలని సునీత ప్రజల్ని కోరారు. దీంతో పాటు షర్మిల.. వైఎస్ జగన్ పాలనలో వైఫల్యాలను కూడా ఎండగట్టారు. పోలవరం, రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్మెంట్, ప్రత్యేకహోదా, కడపలో స్టీల్ ప్లాంట్ వంటి విషయాలను షర్మిల లేవనెత్తారు.











