కడప జిల్లాలో ఎస్సీ సామాజికవర్గం నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డికి సహాయ నిరాకరణ ఎదురైంది. రాష్ట్రంలో దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా జగన్ పట్టించుకోని కారణంగా వారంతా జగన్కు దూరం జరిగారు. ఈ మేరకు కడప జిల్లాలో మాదిగ సంఘాలు ఏకం అయ్యాయి. జగన్ కు ఓటు వేయవద్దని, ఆయనకు ఏ విషయంలోనూ మద్దతు తెలపవద్దని తీర్మానించుకున్నాయి. ఈ మేరకు మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరిపోగు వెంకటేశ్వరరావు మాదిగ వెల్లడించారు.
కూటమి గెలుపు కోసం విజయవాడ నుంచి శ్రీకాళహస్తి వరకు చేపట్టిన చైతన్య యాత్ర కడపకు చేరుకుంది. ఈ సందర్భంగా బుధవారం ఇక్కడ మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రంలో దళితులకు న్యాయం జరగాలన్నా, వారికి రక్షణ ఉండాలన్నా, లేదా తమ సామాజికవర్గం ప్రజలకు సంక్షేమ పథకాలు నిరాటంకంగా అందాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని మాదిగ సంఘం నేతలు తీర్మానించుకున్నారు. కడప జిల్లాలో టీడీపీ గెలుపు కోసం తాము పని చేస్తామని చెప్పారు. అలా రాష్ట్రంలో ఉన్న 35 మాదిగ సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీల సంక్షేమాన్ని జగన్ కాలరాశారని.. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు రద్దు చేశారని వారు ఆరోపించారు. దళితులపై దాడులు జరుగుతున్నా జగన్ మౌనం వహించడం తమకు నచ్చడం లేదని అన్నారు. గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. జగన్ డ్రామాలు ఇక సాగవని, దళితులందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని తమ సామాజికవర్గానికి పిలుపు ఇచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి మాల, మాదిగలం అందరం సహకరించామని.. తమ ఓట్ల వల్లే జగన్ మోహన్ రెడ్డి గెలిచారని అన్నారు. ఇప్పుడు తమ ఓట్లను చంద్రబాబు గెలుపు కోసం వాడతామని వారు చెప్పారు. మొత్తానికి జగన్ పులిందులలో నామినేషన్ వేసే సమయంలోనే మాదిగలంతా ఏకతాటి పైకి వచ్చి జగన్ కు సహాయ నిరాకరణ చేయడం ఆ పార్టీ వర్గాల్లో నిరాశను మరింత పెంచింది.
మరోవైపు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందక్రిష్ణ మాదిగ కూడా కూటమికే మద్దతు తెలుపుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మాదిగల వర్గీకరణ విషయంలో మాదిగలను జగన్ మోసం చేశారని మందకృష్ణ ఆరోపించారు. టీడీపీ అధికారంలో రాగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణకు అనుకూలంగా బిల్లు పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఇటీవల మందక్రిష్ణ అన్నారు. మాదిగలంతా కూటమి గెలుపు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు