ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనడంలో ఏ సందేహమూ లేదు. ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ లీడర్ షిప్ లోని అప్పటి ఐ ప్యాక్ సంస్థ జగన్ అధికారంలోకి రావడం కోసం ఎంతో సాయం చేసింది. నవరత్నాలు లాంటి పథకాలు రూపొందించడంతో పాటు ఓటర్లలో జగన్ పట్ల సానుకూలత ఏర్పడేలా పీకే ఎన్నో వ్యూహాలు రచించారు. అలాంటి పీకే ఇప్పుడు జగన్ పట్ల ఎంత విముఖతతో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొంత కాలం నుంచే ఆయన పాలన పట్ల ప్రశాంత్ కిషోర్ కు వెగటు పుట్టడం మొదలైంది.
అందుకే ప్రస్తుతం ఐ ప్యాక్ సంస్థ వైఎస్ఆర్ సీపీకే సేవలు అందిస్తున్నప్పటికీ పీకే మాత్రం తన వాటాలతో ఆ సంస్థ నుంచి బయటికి వచ్చేశారు. అంతేకాక, జగన్ పైన, ఆయన పాలన పైన వ్యతిరేక కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కూడా వివిధ వేదికలపై పీకే మాట్లాడుతూ.. జగన్ కు వ్యతిరేకంగా ఎన్నో వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. జగన్ ఓడిపోవడం ఖాయం అని పదే పదే చెబుతూ వస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు, సర్వేలు, అంచనాలకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తి ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్ దిగిపోవడం ఖాయమని పదే పదే చెబుతుండడం వైఎస్ఆర్ సీపీ వర్గాలకు నచ్చడం లేదు.
తాజాగా ప్రశాంత్ కిషోర్ జగన్ పైన తన అభిప్రాయాలను పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ఏపీ అభివృద్దికి జగన్ చేసింది ఏమి లేదని పీకే తేల్చేశారు. సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని అటకెక్కించారని దుయ్యబట్టారు. ‘‘వైఎస్ జగన్.. ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ లాగా ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తే గెలుస్తామని భ్రమలో ఉన్నారని.. అది సాధ్యం కాదని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన నాయకుడు బటన్లు నొక్కి వారికి డబ్బులు పంచడమే కాకుండా.. వారి కోరికలను, ఆకాంక్షలను కూడా నెరవేర్చాలని పీకే అన్నారు. ‘‘నేను రాజును.. మీకేం కావాలో నాకు బాగా తెలుసు.. డబ్బులిస్తున్నా కదా.. మీకు మంచి జరుగుతోంది.. కాబట్టి నాకు ఓటు వేయండి’’ అని జగన్ ఓటు అడుక్కోవడం సరికాదని అన్నారు.
అప్పట్లో చక్రవర్తులు, రాజులు ఇలాగే ప్రజలకు నజరానాలు ఇచ్చేవారని ప్రశాంత్ కిషోర్ గుర్తు చేసారు. డబ్బులిస్తున్నాము కాబట్టి రోడ్లు, ధరల పెరుగుదల, ఇతర మౌళిక సదుపాయాలు లేకపోయినా.. ప్రజలు పెద్దగా పట్టించుకోరనే విషయాన్ని జగన్ విస్మరించారని పీకే గుర్తు చేశారు. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో కచ్చితంగా ఎన్టీయే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు.