ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఎంత ఆసక్తి ఉందో.. కడప పార్లమెంటు నియోజకవర్గం గురించి కూడా అదే ఉత్కంఠ నెలకొంది. అక్కడ ప్రత్యర్థులుగా పోటీలో ఉన్నవారు ఒకే కుటుంబానికి చెందిన వారు.. అంతేకాక, ఎంతో పేరున్న పెద్ద కుటుంబం అది. స్వయంగా సీఎం వైస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే.. వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ, సీఎం సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. అభ్యర్థులైన అక్కా తమ్ముళ్ల మధ్యే ప్రధానమైన పోటీ నెలకొంది.
ఇప్పుడు కడపలో గెలుపు కోసం ఎవరికి వారు తమ ప్రత్యర్థిపై సూటి విమర్శలు చేస్తున్నారు. తమ ఫ్యామిలీ అని కూడా చూడట్లేదు. నిజానికి వ్యక్తిగత విభేదాలు ఇలా రాజకీయ విభేదాలకు దారితీశాయి. అధికారం కోసం వైఎస్ జగన్, అవినాష్ రెడ్డి పన్నిన కుట్ర ఫలితమే ఇలా కుటుంబం చీలిపోవడం అని అందరూ చెబుతారు. కడప కేంద్రంగా ఇప్పుడు గత ఐదేళ్ల క్రితం జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు హాట్ టాపిక్ గా ఉంది. అందులో నిందితుడిగా ప్రస్తుత ఎంపీ అవినాష్ ఉండడం.. ఆయనకు పెద్ద మైనస్ గా ఉంటోంది. పైగా.. తన తండ్రి వివేకా కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీతా రెడ్డి.. వైఎస్ షర్మిలకు మద్దతుగా నిలబడడం అవినాష్ రెడ్డికి కోలుకోలేని దెబ్బగా ఉంటోంది.
దాదాపు ప్రతి రోజూ వైఎస్ షర్మిలతో ప్రచారంలో సునీత పాల్గొంటున్నారు. తన తండ్రిని వైఎస్ జగన్ కనుసన్నల్లో అవినాష్ ఎలా హత్య చేయించారనే విషయాలను సునీత నేరుగా ప్రజలకు చెబుతున్నారు. కడపలో అభివృద్ధి విషయం వెనక్కి వెళ్లిపోయి.. ఇప్పుడు వైఎస్ వివేకా హత్య విషయమే ప్రధాన అంశంగా మారిపోయింది. ఇలా చేయడంలో మొదటి నుంచి షర్మిల, సునీత విజయం సాధించారు. గ్యాప్ ఇవ్వకుండా షర్మిల, సునీత చేస్తున్న ఆరోపణలకు అవినాష్ రెడ్డికి ఊపిరాడడం లేదు. ఇటీవల వివేకా హత్య అనంతరం తీసిన వీడియోలు, ఇతర సీబీఐ ఆధారాలతో సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా అవినాష్ ను అక్కాచెల్లెళ్లు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు.
షర్మిల, సునీతా రెడ్డి ధాటికి అవినాష్ రెడ్డి తేలిపోతున్నారు. ప్రత్యర్థులను ఎదుర్కోలేకపోతున్నారు. అవినాష్ ప్రచారం కూడా ఉద్ధృతంగా సాగడం లేదు. గతంలో గడప గడపకీ తిరిగి నానా హడావిడి చేసిన అవినాష్ రెడ్డి తాజాగా తనపై సునీత, షర్మిల తీవ్ర ఆరోపణలు చేయడంలో ఆయన చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తోంది. తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను తిప్పి కొట్టలేక తడబడుతున్నట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొన్న తనకు ఏ పాపం తెలియదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకొనే ప్రయత్నం చేశారు. కానీ, అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ వీడియోలు రీల్స్ రూపంలో విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి. ఈ సూచనలతో పాటు కడపలో ఉన్న రాజకీయ వాతావరణాన్ని బట్టి, అవినాష్ రెడ్డి ఓడిపోవడం చాలా సులభమని విశ్లేషకులు భావిస్తున్నారు.