జగన్ సర్కారు వచ్చాక ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామి రెడ్డి వ్యవహరించిన తీరు ఎంత పక్షపాతంగా ఉందో అందరికీ తెలిసిందే. అధికార పార్టీ అగ్రనేతలు చెప్పిందల్లా చేసి తక్కువ కాలంలోనే పదోన్నతులు పొందారు. విపక్ష నేతలను బాగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. అక్రమ కేసులతో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి తన కెరీర్లోనే అతి పెద్ద మచ్చ తెచ్చుకున్నారు. ఇలాంటి ఐపీఎస్ అధికారులు ఎన్నికల వేళ కూడా విధుల్లో ఉంటే ఇక మొదటికే ప్రమాదం వస్తుంది. అందుకే ఇలాంటి గతి తప్పిన అధికారులను తప్పించే పనిని కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది. అందులో భాగంగా కొల్లి రఘురామిరెడ్డిని దూరంగా పంపేసింది.
కొల్లి రఘురామిరెడ్డిని పంపేయడంతో ఎన్నికల వేళ వైఎస్ జగన్కు బిగ్ షాక్ తగిలినట్లయింది. ప్రస్తుతం సిట్ చీఫ్గా కొల్లి రఘురామిరెడ్డి ఉన్నారు. ఏపీ నుంచి తీసేసి అసోం పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. దీనికి సంబంధించి ఏప్రిల్ 8న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో కొల్లి రఘురామిరెడ్డి రాష్ట్రం వదిలి పోవాల్సి ఉంది. అసోంలో గువహటి నుంచి ఆయన ఎన్నికల పరిశీలకుడిగా కొంత కాలం పని చేయాల్సి ఉంటుంది.
గత ప్రభుత్వ హాయాంలో తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలపై జగన్ సర్కారు సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దానికి కొల్లి రఘురామిరెడ్డే నాయకత్వం వహించేలా జగన్ సర్కారు ఆయనకు బాధ్యతలు ఇచ్చింది. అందులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి.. ఆ కేసుల కోసం తప్పుడు పత్రాలు క్రియేట్ చేసి ఎన్నో కుట్రలు పన్నారు. చంద్రబాబుపై మోపిన అక్రమ కేసులకు సంబంధించిన ఫైళ్లను సోమవారం ఉదయం సిట్ కార్యాలయం వద్ద దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ పని కొల్లి రఘురామి రెడ్డే చేయించారనే టాక్ ఉంది. ప్రభుత్వం మారిపోతుందనే బలమైన సంకేతాల నడుమ తమను తాము రక్షించుకోవడం కోసం జగన్ అండ్ కో ఈ ప్లాన్ వేసిందని అంటున్నారు.
సీఎం వైఎస్ జగన్కు అత్యంత నమ్మకస్తుడిగా.. ఆయన ఏం చెప్తే అది అమలు పర్చే సైనికుడిలా రఘురామిరెడ్డే వ్యవహరిస్తున్నారని బాగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ రఘురామిరెడ్డిని ఎన్నికల సంఘం ఏపీ నుంచి తప్పించడం చర్చనీయాంశం అయింది. రఘురామిరెడ్డి నియామకాన్ని ఆపడానికి జగన్ వ్యవస్థలను మేనేజ్ చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేదని అంటున్నారు.