తెలంగాణ ముఖ్యమంత్రిగా గతేడాది రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే.. అటు ఏపీలో సీఎంగా చంద్రబాబు అయితే, ఇరు రాష్ట్రాలకు మంచిదనే అభిప్రాయం మొదటి నుంచి ఉంది. అనుకున్నట్లుగానే ఏపీ ప్రజలు గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి.. కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కోసం ఎదురు చూస్తున్న వేళ ఆ సందర్భం రానే వచ్చింది. వీరి భేటీకి చాలా ప్రాధాన్యం ఉంది.
ఒకప్పుడు చంద్రబాబు పార్టీలోనే రేవంత్ రెడ్డి చేరి అంచెలంచెలుగా ఎదిగారు. మారిన పరిస్థితుల కారణంగా రేవంత్ కాంగ్రెస్లో చేరడం, తర్వాత పీసీసీ చీఫ్ అవ్వడం, ప్రభుత్వంతో పోరాడి.. ఎన్నికల్లో గెలవడం జరిగిపోయాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి కూడా సీఎం అయ్యారు. ఇప్పటికీ కొంత మంది రేవంత్ రెడ్డిని చంద్రబాబు శిష్యుడిగానే పరిగణిస్తూ ఉంటారు. అయితే, ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉండడంతో వీరిద్దరూ కలిస్తే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.
అలా మొత్తానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజా భవన్లో వీరి సమావేశం జరగనుంది. చంద్రబాబు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిందని.. విభజన అంశాలపై ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్ కూడా అంగీకరించారు. దీనిపై నేడు లేఖ ద్వారా తన అంగీకారాన్ని తెలియపర్చనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశానికి సీఎంలు మాత్రమే కాకుండా.. రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ మంత్రులు, సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు. విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పెండింగ్లో ఉన్న పంపకాలు, ఉమ్మడి సంస్థలు, ఆస్తుల విభజన ఇలా వివిధ అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. సీఎంల హోదాలో చంద్రబాబు, రేవంత్ సమావేశం కావడం ఇదే మొదటిసారి అవుతుంది. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు రాజకీయ పార్టీలుగా ఉండడంతో వీరిద్దరూ కలుసుకోలేదు. తాజాగా ఆ సందర్భం రావడంతో చంద్రబాబు – రేవంత్ రెడ్డి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.