మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల చిట్టాలో రోజుకొక గుట్టు బయటికి వస్తోంది. మొన్నటికి మొన్న ఎర్ర చందనం స్మగ్లింగ్ కు సంబంధించి ఓ కుంభకోణం వెలుగు చూసింది. ఆయనకు చెందిన లారీలను ఏకంగా నేపాల్ లో పట్టుకున్న విషయం కలకలం రేగింది. అక్కడి పోలీసులు ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించడంతో ఆ సరకు మొత్తాన్ని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక కుంభకోణంలో వారు చేసిన అక్రమాల ఆరోపణలు ఎలాగో ఉన్నాయి. తాజాగా మరో కుంభకోణం బయట పడకుండా పెద్దిరెడ్డి మనుషులు చేసిన పని కలకలం రేపుతోంది.
కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ – అవనిగడ్డ కరకట్టపై తగలబెట్టారు. బుధవారం రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు ఇలా తగలబెట్టడం కలకలం రేపింది. ఇందులో కొన్ని సీఎంఓకు చెందిన ఫైల్స్, కాలుష్యనియంత్రణ మండలికి చెందిన హార్డ్డిస్కులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు చెందిన ఫైల్స్ కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దిరెడ్డి సంబంధిత శాఖల బాధ్యతలను వైసీపీ హాయాంలో వెలగబెట్టిన సంగతి తెలిసిందే.
అయితే, ఏపీ16 ఈఎఫ్ 2596 నంబరు గల ఇన్నోవా వాహనంలో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో కొందరు వ్యక్తులు కరకట్ట పైకి వచ్చారు. ఈ వాహనం వెనుక ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ కూడా ఉంది. వీరు పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్ కాలనీ వద్ద కారు నిలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు డిక్కీలో ఉన్న బస్తాల్లోని దస్త్రాలను కరకట్టపై తగలబెట్టడం మొదలుపెట్టారు. అటుగా వెళ్తున్న ఓ టీడీపీ కార్యకర్త దీన్ని గమనించి అనుమానం వచ్చి.. పరిశీలించారు. ఆ దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ సమీర్శర్మ ఫోటోలు ఉండడంతో అనుమానం మరింత బలపడింది.
ఆయన వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ నేతలకు సమాచారం అందించారు. దీంతో పెదపులిపాక టీడీపీ నేతలు, కార్యకర్తలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇది గమనించిన ఇన్నోవాలోని వ్యక్తులు యనమలకుదురు వైపు పారిపోయారు. యనమలకుదురులో టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. సమీర్ శర్మ సూచనతో దస్త్రాలు తీసుకొచ్చి తగలబెట్టినట్టు ఇన్నోవా డ్రైవర్ నాగరాజు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో పెద్దిరెడ్డి మరో కుంభకోణం బయటపడింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు