కరోనా రోగులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంది. కింగ్ జార్జి ఆసుపత్రిలో నిర్మించిన సి.ఎస్.ఆర్. బ్లాక్ అందుబాటులోకి రావడంతో కరోనా రోగులకు జిల్లాలో ఈ కష్టాలు దాదాపుగా తీరినట్టే. దాతలు పుణ్యమా అని… కింగ్ జార్జ్ ఆసుపత్రిలో సి ఎస్ ఆర్ బ్లాక్ అధునాతన వైద్య సదుపాయాలతో అందుబాటులోకి వచ్చింది. ఆసుపత్రిలో 500 బెడ్స్ కు గాను, 175 బెడ్స్ వెంటిలేటర్ సదుపాయంతో, మరో 325 బెడ్లు ఆక్సిజన్ సరఫరా తో అందుబాటులోకి వచ్చాయి.

ఇదే బ్లాక్లో మూడు ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్, సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతీ గదిని సీసీ కెమెరా తో అనుసంధానం చేశారు. మోనిటరింగ్ చేసేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. రోగులకు వైద్య సేవలు అందించేందుకు 24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రత్యేకంగా ఈ బ్లాక్ కోసం..50 మంది వైద్యులు, 50 మంది నర్సులు, 100 మంది పారామెడికల్ ఇతర సిబ్బందిని కేటాయించారు.
దీనితో నగరంలో మొత్తం 1, 200 పడకలతో కరోనా బాధిత పేదలకు ఉచిత సేవలు అందించేందుకు వీలు కలుగుతుంది. ప్రధానంగా ఆక్సిజన్ సరఫరా కొరత కారణంగానే అనేక మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇకపై విశాఖలో కరోనా వైరస్ మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
కేజీహెచ్ తో పాటు నగరంలో ఛాతీ ఆసుపత్రి, ఈ ఎన్ టి, ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాలకు సంబంధించి విమ్స్ ఆసుపత్రిలో ప్రభుత్వ సేవలు అందుబాటులో వుండగా అదనంగా సిఎస్ఆర్ బ్లాక్ చేరింది. జిల్లాలోని అన్ని పిహెచ్ సిలలో కరోనా పరీక్షలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడంతో రానున్న రోజుల్లో జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది.