ప్రతి ఏడాది రాష్ట్రప్రజలు, దేశవ్యాప్తంగా ప్రజలు కూడా దసరా నాడు ఆశ్చర్యంగా గమనించే గ్రామీణ ఉత్సవాల్లో కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం కూడా ఒకటి. గుంపులుగా జనం చేరి కర్రలతో తలలు పగలగొట్టుకుని నెత్తురు ధారలుగా కార్చి.. ఆనందించే ఉత్సవం ఇది.
ఈ సంవత్సరం దేవరగటట్టు కర్రల సమరం జరగుతుందో లేదో అర్థం కావడం లేదు. కరోనా కారణంగా పోలీసులు దీనిని నిషేధించారు. కానీ.. వేడుక నిర్వహించే కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏమౌతుందోననే ఆందోళన ప్రజల్లో ఉంది.
దేవరగట్టు కర్రల సమరం అమానుషంగా ఉంటుందని దీనిని నిర్వహించడం నిషేధించాలనే డిమాండ్లు చాలా కాలంగా కొన్ని వర్గాలనుంచి ఉన్నాయి. దాదాపుగా ప్రతి ఏటా దీనికి వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్లు పడడమూ.. ఏదో ఒక రీతిగా సమరం యథావిధిగా జరిగిపోవడమూ అవుతుంటుంది. ఈసారి ఏకంగా పోలీసులు రెండు వారాల ముందే నిషేధించి, గట్టిగా ఆంక్షలు పెడుతున్నారు.
దేవరగట్టు కర్రల సమరానికి ఆంక్షలు
నేడు, రేపు రెండురోజుల పాటు దేవరగట్టు ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ సెక్షన్ కింద నలుగురు వ్యక్తులు ఎక్కడ గుంపుగా కనిపించినా అరెస్టు చేస్తారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. హోళగుంద, ఆలూరు మండలంలో ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
ఆలూరు,హోళగుంద రెండు మండలాల్లోను ఆది, సోమవారాలు రెండు రోజులపాటు పోలీసులు పూర్తిగా లాక్ డౌన్ విధించారు. దేవరగట్టుకు వెళ్లే అన్ని దారులు పూర్తిగా బంద్ చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఎవరూ రావద్దంటూ పోలీసులు విన్నవిస్తున్నారు.
కర్రల సమరం లేకుండా దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15 చెక్ పోస్ట్ లు 50 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏడుగురు డీఎస్పీలు 28 మంది సీఐలు 73 మంది ఎస్ఐలు వెయ్యి మందికి పైగా పోలీస్లతో పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు.
రెండు వారాల ముందే నిషేధం
దేవరగట్టు కర్రల సమరాన్ని పోలీసులు ఈ దఫా రెండు వారాల కిందటే నిషేధించారు. ఈ మేరకు డీఎస్పీ వినోద్ కుమార్ 11వ తేదీనే ఆదేశాలు జారీచేశారు. దసరా విజయ దశమి జరిగే రోజున జైత్రయాత్ర కు ఫుల్ స్టాప్ పెట్టారు. నిజానికి వందల సంవత్సరాల నుండి వస్తున్న ఆచారాన్ని బ్రేక్ చేయడం తొలిసారి. హోలగోంద మండలం దేవరగట్టులో 26 న దసరా పండగ రోజు మాల మల్లేశ్వరస్వామి కొండలో కర్రల సమరం జరగాల్సి ఉండగా.. డీఎస్పీ వినోద్ కుమార్ ఉత్తర్వులతో అంతా సందేహంలో పడింది. రాష్ట్రంలో కరోన వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతుండడంతో ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని కోవిడ్ 19 నియమ నింబంధనలో బాగంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
కర్రల సమరంపై భిన్నాభిప్రాయాలు
హోలగుంద మండలం దేవరగట్టు దసరా బన్నీ కర్రల సమరం జైత్రయాత్ర ఆగేనా ? జరిగేనా? అనే సందేహాలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్నాయి. బన్నీ ఉత్సవం- కర్రల సమరం అనేది సంప్రదాయం మాత్రమే అని స్థఆనికులు అంటుంటారు. ఇది సమరం కాదని, రక్తం చుక్క పడాల్సిందే అనే అభిప్రాయం పలువురిలో ఉంది.
కొంతమంది భక్తులు మాత్రం కర్రల సమరం జరిపి తీరుతాం అంటున్నారు. ఆచారాన్ని, సంప్రదాయన్ని నిలువరించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వందల ఏళ్ల నాటి సంప్రదాయాన్ని కాపాడుకోవాలని, కోవిడ్ నిబంధనల ప్రకారమే నిర్వహించుకుంటామని అంటున్నారు. బన్నీ ఉత్సవం కర్రల సమరాన్ని నిలువరించలేం అంటున్నారు.
అదేసమయంలో కరోనా మహమ్మారి ప్రబలంగా ఉండడంతో బన్నీ కర్రల సమరం ఆడము అని కొంతమంది అంటున్నారు. ఈసారి దసరా నాడు కర్రల సమరం లేదు అని రెవెన్యూ, పోలీసు అధికారులు గ్రామగ్రామాన ప్రచారం చేస్తున్నారు. బన్నీ ఉత్సవం జరగకుండా నిషేధించాం అని ఆలయ కమిటీ చైర్మన్ కూడా కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని గ్రామగ్రామాన పరిస్థితులను వివరిస్తున్నారు
దేవరగట్టు సాంప్రదాయం కనుక బన్నీ ఉత్సవం కచ్చితంగా జరపడానికి మూడు గ్రామాల ప్రజలు సర్వం సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. వారి వాదన కూడా భిన్నంగా ఉంది. కర్రల సమరంలో బండారు (పసుపు) వాడుతాం అని.. అది గొప్ప యాంటిబయోటెక్ కనుక కరోనాకు భయపడేది లేదని వారు వాదిస్తున్నారు.
మంత్రి జయరాం ఏమంటున్నారంటే..
దేవరగట్టు పై కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం భిన్నంగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు ప్రత్యేకత ఉందని, కానీ. ఏ ఏడాది కరోనా మహమ్మారి దృష్ట్యా కర్రల సమరం లేకుండా కల్యాణం, పూజలు జరుపుకోవాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున కర్రల సమరం నిషేధించారంటున్నారు. భక్తులు ప్రజలు సహకరించి బన్నీ ఉత్సవాలను సాంప్రదాయబద్దంగా కర్రల సమరం లేకుండా నిర్వహించాలని కోరుతున్నారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో రకరకాల ఆంక్షలు ఉన్నాయి. కరోనా ఆంక్షలు నిబంధనలు దేవరగట్టు కర్రల సమరానికి కూడా వర్తిస్తుంది. కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన భక్తులు కర్రల సమరం జరగకుండా ఉండేందుకు సహకరించాలని కోరుతున్నారు.











