TTDకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో TTD ఈవోగా పని చేసిన AV ధర్మారెడ్డిని సిట్ మంగళవారం విచారించింది. సిట్ అధికారుల ప్రశ్నలకు ధర్మారెడ్డి సగంసగం సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. మరికొన్ని ప్రశ్నలకు ఆయన సైలెంట్గా ఉన్నారని తెలుస్తోంది. విచారణ సందర్భంగా ధర్మారెడ్డి కీలక విషయాలు బయటపెట్టినట్లు సమాచారం.
కల్తీ నెయ్యి సరఫరాను ఎందుకు అడ్డుకోలేదని సిట్ ప్రశ్నించగా హైకమాండ్ ఒత్తిడితోనే అనుమతించాల్సి వచ్చిందని ధర్మారెడ్డి జవాబు ఇచ్చినట్లు సమాచారం. ఎవరా హైకమాండ్ అని అడిగితే సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. గతంలో TTD ప్రత్యేకాధికారిగా ఉన్నారు కదా? మరిప్పుడు ఎందుకు బాధ్యతగా వ్యవహరించలేదని ప్రశ్నించగా.. 2019లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించానని బదులిచ్చారు. 2022 ఆగస్టులో తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీవైష్ణవి, ఉత్తర్ప్రదేశ్లోని ప్రీమియర్ అగ్రిఫుడ్స్, భోలేబాబా డెయిరీ ట్యాంకర్లు, క్యాన్ల ద్వారా సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూరులోని CFTRI ల్యాబ్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా ధర్మారెడ్డి మౌనం వహించినట్లు సమాచారం.
TTDలో నెయ్యి, బియ్యం, జీడిపప్పు, యాలకులు, ఇతర వస్తువుల కొనుగోళ్లు ఎలా జరుగుతాయి? నెయ్యి టెండర్ల ఖరారులో ఎవరెవరికి ప్రమేయం ఉంటుంది? ఆయా ప్లాంట్లను ఎన్ని నెలలకు తనిఖీ చేస్తారు? లోటుపాట్లు మీ దృష్టికొచ్చాయా? ఏఆర్ డెయిరీ తిరుమలకు కిలో నెయ్యి రూ.318.57కే సరఫరా చేస్తామని చెప్పినప్పుడు అనుమానం ఎందుకు రాలేదు? నాణ్యమైన నెయ్యి ఆ ధరకు ఇవ్వలేరు కదా?అని సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. కొనుగోళ్లకు కమిటీని నియమిస్తామని, ఏడాదికోసారి తనిఖీలు జరుగుతాయని ధర్మారెడ్డి తెలిపారు.
TTDకి నెయ్యి సరఫరా చేయాలంటే జాతీయ డెయిరీలకు రోజూ 4 లక్షల లీటర్లు, రాష్ట్రంలోని డెయిరీలకు 2లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలని కొన్నేళ్ల క్రితమే నిబంధనలు ఉండగా..మీ హయాంలో 2020 ఫిబ్రవరిలో ‘మిల్క్’ అనే పదాన్ని ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. భోలేబాబా డెయిరీకి కాంట్రాక్టు కట్టబెట్టేందుకే నిబంధనల్లో ఇష్టారాజ్యంగా మార్పులు చేశారా? అని అడిగారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేదని, కమిటీలే చూసుకున్నాయని ధర్మారెడ్డి చెప్పారు. 2023 నవంబరులో తిరిగి ‘మిల్క్’ పదాన్ని టెండరు నిబంధనల్లో ఎందుకు చేర్చాల్సి వచ్చిందని, ఎవరెవరికి లబ్ధి చేకూరిందో చెప్పాలని ప్రశ్నించగా తనకు తెలియదని సమాధానం ఇచ్చారు.
2019-23 మధ్య TTD ఛైర్మన్గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డికి కల్తీ నెయ్యి వ్యవహారంలో పాత్ర ఉందా? అని ఆరాతీసినట్టు సమాచారం. కొనుగోళ్లు కమిటీలే చూసుకుంటాయని ధర్మారెడ్డి బదులిచ్చినట్లు సమాచారం











