కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం.. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణను రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు.. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఫరిడవిల్లేందుకు అవసరమైన మూల స్తంభాల్లో భాగంగా ఉన్నాయంటే.. అధికారంలో ఉన్న పార్టీలు ఏవైనా.. పాలకులు ఎవరైనా.. అధికారులు ఎక్కడివారైనా.. ఎన్నికల నిర్వహణ వ్యవస్థ స్ఫూర్తికి విఘాతం కలిగించలేదు. ఎన్నికల సంఘాలు తీసుకున్న నిర్ణయాలతో విభేధించారు కాని ఘర్షణకు దిగలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు, సందర్భాలూ చాలా ఉన్నాయి.
1981వరకు ఉమ్మడి ఏపీలో సమితి వ్యవస్థ ఉండేది. అయితే ఎన్టీఆర్ వచ్చాక.. గ్రామ పంచాయతీల వ్యవస్థ ఏర్పాటైంది. 1989లో జరిగిన పంచాయతీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. 1994కి ముందు పంచాయతీలకు ఎన్నికలు జరిపే బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికే ఉండేది. అయితే 1989, 1992 పంచాయతీ రాజ్ చట్టం, 73, 74వ రాజ్యాంగ సవరణలద్వారా స్థానిక సంస్థలకు అధికారాలు రావడం, జవాబుదారీతనం పెరగడం, స్వయం పాలన చట్రం పరిధిలో స్థానిక సంస్థలు రావడంతో దేశ వ్యాప్తంగా 1994లో రాష్ట్రాల ఎన్నికల సంఘాలు ఏర్పాటయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తున్నాయి. అప్పటినుంచి ప్రత్యేక అధికారుల పాలన ఉన్న సమయాల్లో తప్ప.. ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదే.
ఇక తాజా పరిస్థితి విషయానికి వస్తే.. ఏపీలో ఎన్నికల సంఘానికి , రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ జరుగుతోంది. గతంలోనూ ఒకరి నిర్ణయాలతో మరొకరు విభేధించినా.. ఘర్షణ వాతావరణం మాత్రం తలెత్తలేదు. వైఎస్ ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ వివాదాల్లో ఎన్నికల సంఘం నిర్ణయానికి పాలకులు కట్టుబడాల్సి వచ్చింది. అక్కడ తప్పొప్పులు, ఇగోల కంటే.. వ్యవస్థల పరస్పర సహకారం, స్పూర్తి ప్రాధాన్య అంశాలుగా మారాయి.
వైఎస్ హయాంలో ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహారంలో..
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2006లో విశాఖ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కలెక్టర్ (జిల్లా ఎన్నికల ప్రధానాధికారి) గా ప్రవీణ్ ప్రకాశ్ ఉన్నారు. అంతకుముందే ఆయన నర్సీపట్నం ITDA పీడీగా, విజయవాడ కమిషనర్ గా పనిచేశారు. సంచలన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా పేరుంది. ఈ ఉప ఎన్నికల విషయంలో టీడీపీ పలు ఫిర్యాదులు చేసింది. దీంతో కొన్ని బదిలీలు జరపాల్సి వచ్చింది. తరువాతి క్రమంలో ఆ ఎన్నికల్లో పనిచేయాల్సిన అధికారుల జాబితాకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన జాబితాలో ప్రత్యేక కారణాలు ఉంటే తప్ప, ఎన్నికల సంఘం అనుమతి ఉంటే తప్ప జాబితాను మార్చకూడదు. అయితే ఆ జాబితాలో మార్పులు జరిగాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి జిల్లా ఎన్నికల ప్రధానాధికారిని వివరణ అడిగింది. ఆ వివరణతో శాంతించని ఎన్నికల సంఘం ప్రవీణ్ ప్రకాశ్ ని కూడా బదిలీ చేసేలా ఉత్తర్వులు జారీచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ ఆదేశంతో వైఎస్ విబేధించారు. రెండురోజులపాటు ఆ ఆదేశాలను అమలుచేయలేదు. తరువాత ఎలాంటి సంప్రదింపులు జరిగాయనే విషయం బయటకు రాలేదు కాని.. ప్రవీణ్ ప్రకాశ్ పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అనంతపురం, కడప జిల్లాల్లో ని అధికారుల బదిలీకి, ప్రకాశం జిల్లాలో ఓ అధికారి బదిలీని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించినా.. వైఎస్ తొలుత అమలు చేయలేదు. అయితే రెండురోజుల వ్యవధిలో ఆ ఆదేశాలను అమలుచేయాల్సి వచ్చింది. 2008 వికారాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలోనూ రంగారెడ్డి కలెక్టర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ ని బదిలీచేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అదే అధికారిని వైఎస్ ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు బదిలీ చేశారు. ఇక్కడ వైఎస్ ప్రభుత్వం న్యాయపోరాటం చేసే అవకాశం ఉన్నా.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్న నేపథ్యంతో కేంద్రం, కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారా తన మాటే నెగ్గించుకునే అవకాశాలు ఉన్నా వైఎస్ ఘర్షణకు దిగలేదు.
దీనిపై ఆ పార్టీలో వైఎస్ తో దగ్గరగా ఉన్నవారు తరువాతి కాలంలో ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ‘ఎన్నికల సంఘమే లేకుంటే.. ఎన్నికలు ఉండేవి కాదు.. ప్రజాస్వామ్యమే ఉండేది కాదు.. పంచాయతీలకూ ఎన్నికలు జరుగుతున్నాయంటే.. పార్టీలు మనుగడ సాగిస్తున్నాయంటే.. మన రోజూవారి కార్యకలపాలు సాగిస్తున్నామంటే ఆ అధికారాలు రాజ్యాంగం, ఎన్నికల సంఘం అనే వ్యవస్థ ద్వారా సంక్రమించినవే… వాటిని గౌరవించాలి.. తప్పదు’ అని వ్యాఖ్యానించారట.
చంద్రబాబు హయాంలో..
2019 ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ టీడీపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి వివాదాలు తలెత్తాయి. మొదటి వివాదం కేంద్ర ఎన్నికల సంఘంతో కాగా బదిలీల వ్యవహారం, ఓటర్ల తొలగింపు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో తలెత్తింది. ఈ వివాదాల్లో ఎన్నికల సంఘమే సుప్రీం అయింది. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే బదిలీచేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరిచింది..
అనిల్ చంద్ర పునేఠా బదిలీ..
ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం చాలా మంది అధికారులను బదిలీ చేసింది. అందులో శ్రీకాకుళం కలెక్టర్, ఇద్దరు ఎస్పీలు, మంగళగిరి సీఐలతోపాటు ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీచేస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 8మంది అధికారుల బదిలీకి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. మిగతా వారి విషయాల్లో ఈసీ ఆదేశాలను అమలుచేసిన టీడీపీ ప్రభుత్వం ఇంటిలిజెన్స్ చీఫ్ ని బదిలీ చేసేందుకు నిరాకరిచింది. ఇంటెలిజెన్స్ చీఫ్ కు ఎన్నికల విధులతో సంబంధం ఉండదని, ఈ నేపథ్యంలో బదిలీ చేయాల్సిన అవసరం లేదని చెబుతూ.. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా కేంద్ర ఎన్నికల సంఘానికి నోట్ పంపారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆయన ఢిల్లీకి వెళ్లి వివరణ ఇచ్చి వచ్చారు. అదే సమయంలో హైకోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్పు చెప్పింది. దీంతో తమ నిర్ణయాన్ని మార్చుకుంటామని, ఇంటిలిజెన్స్ చీఫ్ ని కూడా బదిలీచేస్తామని కూడా ప్రభుత్వం వెంటనే ఎన్నికల సంఘానికి సమాచారం పంపింది. అయినప్పటికీ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేసింది. ఆ స్థానంలోనే ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడా రాజకీయ ఆరోపణలు వచ్చినా.. ఎన్నికల సంఘం ఆదేశాలే ఫైనల్ అయ్యాయి.
ఇక ప్రొటోకాల్, నిధుల విడుదల, ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో సీఎస్ ఎల్వీ సుబ్రహణ్యానికి, సీఎంఓ కార్యాలయానికి మధ్య వివాదం తలెత్తింది. అక్కడా సీఎం చంద్రబాబు నిరసన వ్యక్తం చేసి పలు వ్యాఖ్యలు చేశారు. అయితే సంఘాలను, అసోసియేషన్లను ఎక్కడా భాగస్వాములను చేయలేదు.
ఇక ఓటర్ల జాబితా విషయంలో లోపాలను సవరించడంలో విఫలం అయ్యారని ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియాను బదిలీచేసిన కేంద్ర ఎన్నికల సంఘం అప్పటికప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారిగా గోపాల క్రిష్ణ ద్వివేదీని నియమించింది. ఈయన బాధ్యతలు స్వీకరించాక వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చింది. సీఎస్ బదిలీ, కలెక్టర్ల బదిలీ, ఎస్పీల బదిలీ, ఇంటిలిజెన్స్ చీఫ్ బదిలీ..అన్నీ ఈయన వచ్చాక అమలైన నిర్ణయాలే అని చెబుతారు. ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక.. అప్పటి ప్రభుత్వ నిర్ణయాలు అమలుకాకుండా.. ఎన్నికల సంఘమే సుప్రీం అన్నట్లుగా వ్యవహరించారు. ఎన్నికలకు, ఓట్ల లెక్కింపు సమయంలోనూ ప్రభుత్వ నిర్ణయాలు అమలుకాలేదు. రైతు రుణమాఫీ చెక్కుల జారీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీఓను రద్దు చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులదీ అదే పరిస్థితి. అప్పట్లో ఆయన కఠినంగా వ్యవహరించిందనుకు గాను బెస్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవార్డు , రూ.లక్ష బహుమతి అందుకున్నారు. ఓటర్ల తొలగింపు, బదిలీల అంశంపై అప్పటి సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలతో విభేధించారు. ఏకంగా ఎన్నికల కమిషనర్ ఛాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. అయినా.. ఎన్నికల సంఘం నిర్ణయమే ఫైనల్ అయింది.
అదే అధికారి.. ఎన్నికల కమిషన్ కి వ్యతిరేకంగా ఇప్పుడు వ్యవహరిస్తుండడం, ఎన్నిక ప్రధానాధికారి పిలిచినా వెళ్లకపోవడం, సీఎంతో సమావేశం ఉందనే కారణంతో గైర్హాజరు కావడం, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలతో విభేధించడం అందరినీ ఆశ్చర్యపర్చుతోంది.